తనను ఎన్నుకొంటే పసుపు బోర్డు తీసుకు వస్తానని బాండు పేపరు రాసిచ్చి గత ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితపై గెలుపొందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మూడేళ్లు అవుతున్నా ఆ హామీని నెరవేర్చలేక పోవడంతో పసుపు రైతుల ఆగ్రవేశాలు ఎదుర్కోవలసి వస్తున్నది. మాట తప్పినందున తన పదవికి రాజీనామా చేయాలని రైతుల నుండి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా, నిజామాబాద్ జిల్లా చేపూర్, రాంచంద్రపల్లికి చెందిన రైతులు, టీఆర్ఎస్ నాయకులు పసుపు బోర్డు తెచ్చే వరకు ఆయన ఇంటి ముందు ఆందోళన చేస్తామని తేల్చిచెప్పారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల విశాఖ కాలనీలో ఎంపీ నివాసం ముందు ట్రాక్టర్లో పసుపు తీసుకొచ్చి కుప్పగా పోశారు.
ఐదు రోజుల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన ఎంపీని ప్రతి గ్రామంలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పసుపు బోర్డు తెస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రైతుల నిరసన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు.
ఇంటి ముందు పోసిన పసుపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఎంపీ ఇంటి ముందు ఆందోళన చేసిన టీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన పార్లమెంటు సభ్యుడికి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని దుయ్యబట్టారు.
కాగా, ఇటీవల మాజీ ఎంపి, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత కూడా నిజామాబాద్లో ప్రెస్మీట్ పెట్టి ఎంపి అర్వింద్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గడిచిన మూడేళ్లలో ఎంపి అరవింద్ రైతులను తీవ్రంగా నిర్లక్షం చేశారని, పసుపు బోర్డు ఎపుడు తెస్తారో రైతులకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
పైగా, మూడేళ్లుగా అర్వింద్ ఇక్కడి పసుపు రైతుల కోసం కేంద్రం నుండి ఎటువంటి సహాయం తీసుకు రాలేకపోయారు అంటూ ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆమె వెల్లడించారు.