చివరకు ప్రధాని మహిందా రాజపక్స రాజీనామా చేయడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆర్థిక సంక్షోభం కారణంగా లంక అధ్యక్షుడు, ప్రధానిపై విపక్షనేతలు, లంకేయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో లంక ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.
మరోవంక శ్రీ లంక రాజధాని కొలంబోలో సోమవారం నిరసనలు తీవ్రమయ్యాయి. రాజపక్సే మద్దతుదారులు నిరసనకారులను కర్రలతో చితకబాదారు. పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అత్తుకోరల నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన నిరసనకారులు ఆయన కారును అడ్డగించారు.
ఈ క్రమంలో ఆయనపై దాడి చేయడంతో అమరకీర్తి మృతిచెందినట్టు లంక మీడియా తెలిపింది. తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కొలంబోలో కర్ఫ్యూ విధించారు. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ నుంచి అధ్యక్ష కార్యాలయం వెలుపల ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు.
ఇటీవల గోటబయ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కేబినెట్ భేటీలో ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.
శ్రీలంకలో విదేశీ మారకద్రవ్యం నిల్వలు తగ్గిపోవడంతో ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ధరలు భారీగా పెరిగి ఆహార సంక్షోభం నెలకొంది. గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తుండడంతో జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.
అధికార ఎంపి మృతి తరువాత సాయంత్రానికి పలు చోట్లకు ఘర్షణలు ఎగబాకాయి. శ్రీలంక ఎంపి ఇల్లు, మాజీ మంత్రి నివాసాలకు సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. మౌంట్ లవానియాలోని మాజీ మంత్రి జాన్సస్టన్ ఫెర్నాండో నివాసం, ఎంపి సనత్ నిషాంత ఇళ్లపై దాడులు తరువాత పెట్రోలు పోసి తగులబెట్టారు. మంటలు చాలా సేపటివరకూ చెలరేగాయి.
దూర ప్రాంతాల వరకూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. కర్ఫూ గుప్పిట్లోని కొలంబోలో జనం నిషేధాజ్ఞలను ధిక్కరించి వీధులలోకి వచ్చారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పలు చోట్ల భాష్పవాయువు ప్రయోగించారు. కొలంబో ఇతర ప్రాంతాలలో బస్సులను ధ్వంసం చేయడం, తగులబెట్టడం వంటి ఘటనలు జరిగాయి.