ఉక్రెయిన్లో రష్యా దాడులు కొనసాగిస్తూ రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన రోజు (మే 9) సందర్భంగా రష్యా విజయోత్సవాలు జరుపుకొంటున్న సమయంలో పోలాండ్ రాజధాని వార్సాలో రష్యా అంబాసిడర్ సెర్గీ ఆండ్రియేవ్పై ఉక్రేనియన్లు దాడి చేశారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మృతిచెందిన రెడ్ ఆర్మీ సైనికులకు సెర్గీ ఆండ్రియేవ్ నివాళులు అర్పిస్తుండగా ఉక్రెయిన్ జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు ఆయనపై ఎరుపు రంగు సిరాను చల్లి నిరసనలు తెలిపారు. ఈ దాడిలో తనకు గాయాలేవీ కాలేదని సెర్గీ చెప్పారు.
ఉక్రెయిన్లో దాడుల నేపథ్యంలో విక్టరీ సందర్భంగా పోలాండ్లో పుష్ప నివాళి ఈవెంట్ను రద్దు చేయాలని అధికారులు రష్యాను కోరారు. కానీ, సెర్గీ ఆండ్రియేవ్ మాత్రం సైనిక శ్మశానవాటికకు వచ్చి పెద్ద సాహసం చేశారు. దీంతో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
ఇలా ఉండగా,నియో నాజీలతో పొంచి ఉన్న ముప్పు నుంచి ఉక్రెయిన్లోని ‘మాతృభూమి’ని రక్షించుకోవడం కోసమే తమ సేనలు పోరాడుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ఏటా మే 9న ‘విక్టరీ డే’ పేరుతో భారీగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.
ఈ ఏడాది కూడా మాస్కోలని రెడ్ స్క్వేర్ వద్ద పరేడ్ను చేపట్టిన సందర్భంగా పుతిన్ ప్రసంగిస్తూ..ఉక్రెయిన్లో పశ్చిమ దేశాల దురాక్రమణను నివారించేందుకే ఈ ప్రత్యేక సైనిక చర్య అని పేర్కొన్నారు. ఉక్రెయిన్లో రష్యా చర్యను రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్ పోరాటంతో పోల్చారు.
ఉక్రెయిన్ సమగ్రత, భద్రతను కాపాడేందుకు రష్యా బలగాలు అక్కడ పోరాడుతున్నాయని పుతిన్ తెలిపారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యన్ సైనికులకు ఆయన నివాళులర్పించారు.
“ప్రతి సైనికుడు, అధికారి మరణం మాకు బాధాకరమైనది. వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవడానికి దేశం ప్రతిదీ చేస్తుంది. రష్యా కోసం, విజయం కోసం, హుర్రే!” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ సంక్షోభానికి.. ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించిన పుతిన్.. కీవ్, దాని మ్రితపక్షాలు రష్యాకు చెందిన చారిత్రక ప్రాంతాలను(రష్యన్ భాష మాట్లాడే డోనాబస్ రీజియన్, క్రిమియా ప్రాంతాన్ని..) ఆక్రమించే యత్నం చేశాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాకు మరో ఛాయిస్ లేదు. రష్యా సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకునేందుకు తీసుకున్న సరైన నిర్ణయం అని మిలిటరీ చర్యను సమర్థించారు.
ఇక నాజీ జర్మనీని ఓడించిన ఘట్టానికి సోమవారం నాటికి 77 ఏళ్లు వసంతాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా రెడ్ స్క్వేర్ వద్ద పదకొండు వేల మంది సైన్యం, 130 మిలిటరీ వాహనాలతో భారీ ఎత్తున్న ప్రదర్శనలు నిర్వహించారు.
వాస్తవానికి ఈ విక్టరీ డే పరేడ్లో పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ దేశంలో కొనసాగిస్తున్న ప్రత్యేక మిలిటరీ చర్యను ఇకపై పూర్తిస్థాయి యుద్ధంగా మారుస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత ప్రసంగంలో అలాంటి ప్రకటన వెలువడలేదు.