‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని సింగపూర్ నిషేధించింది. ఈ సినిమా ఆ దేశ చలన చిత్ర వర్గీకరణ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నందున నిషేధించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
సింగపూర్ చలన చిత్ర వర్గీకరణ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ హిందీ భాషా చిత్రం ఉందని అధికారులు అంచనా వేశారని ఇన్ఫోకామ్ మీడియా డెవలప్మెంట్ అథారిటీ (ఐఎండిఎ), కల్చర్, కమ్యూనిటీ, యూత్ మంత్రిత్వ శాఖ (ఎంసిసివై), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ) సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
కాశ్మీర్ లోయలో జరిగిన ఘర్షణల్లో హిందువులు హింసించబడుతున్నట్లు ఏకపక్షంగా చిత్రీకరించడం, ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఉన్నందున ఈ చిత్రాన్ని వ్యతిరేకించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని కలిగించేలా, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందని, మత సామరస్యానికి భంగం కలిగించేలా ఉందని ఆ వర్గాలు తెలిపాయి.
చలనచిత్ర వర్గీకరణ మార్గదర్శకాల ప్రకారం సింగపూర్లో జాతి, మత వర్గాలను కించపరిచే ఏ చిత్రాన్నైనా నిరాకరిస్తామని వెల్లడించాయి. 1990లో కాశ్మీర్లోయలో ఉగ్రవాదులు హిందూ పండిట్లపై జరిపిన హింసాకాండ ఆధారంగా ఈ చిత్రం రూపొందిందంటూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు.
మే 13న జీ5లో స్ట్రీమింగ్
ఇలా ఉండగా, చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కాశ్మీరీ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటిని షేక్ చేసేందుకు రెడీ అయింది.
ఈ సినిమాను ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 కొనుగోలు చేసిన విషయం తెలిసిందేే. పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కాశ్మీరి ఫైల్స్ చిత్రాన్ని మెచ్చుకున్నారు. ప్రధాని మోడీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మే 13న జీ5లో ది కాశ్మీరీ ఫైల్స్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.