కరోనా సమయంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆర్డర్ పై వస్తువులను ఇంటి వద్దనే డెలివరీ చేయడానికి ఉపయోగించే స్విగ్గీ జీనీ సర్వీసులను ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, బెంగళూరులలో నిలిపి వేశారు. ఈ నగరాల్లో జీనీ పేరుతో అందిస్తున్న పిక్–అప్, డ్రాప్–ఆఫ్ సర్వీసులు తాత్కాలికంగా ఆపేసినట్లు స్విగ్గీ తెలిపింది.
ఉద్యోగుల కొరత వల్లే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జీనీ సర్వీసు తాత్కాలికంగా అందుబాటులో లేదని స్విగ్గీ యాప్లో చెబుతోంది. వారం రోజులుగా జీనీ సేవలు అందుబాటులో లేవని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఫుడ్–డెలివరీ, క్విక్ కామర్స్ బిజినెస్ ఇన్స్టామార్ట్ల పైనే స్విగ్గీ ఫోకస్ పెడుతోందని పేర్కొంటున్నాయి.
జీనీ సేవలను 68 నగరాలలో అందిస్తుండగా, 3 నగరాలలో మాత్రమే నిలిచిపోయాయి. ఐపీఎల్, పండుగల సీజన్తో ఫుడ్ డెలివరీ, ఇన్స్టామార్ట్ సర్వీసులకు డిమాండ్ పెరగిందని, ఫలితంగా వాటికి పెద్దపీట వేయాల్సి వస్తోందని స్విగ్గీ స్పోక్స్ పర్సన్ వెల్లడించారు. త్వరలోనే మళ్లీ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
డెలివరీలు ఇచ్చే గిగ్ వర్కర్ల (ఉద్యోగ భద్రత ఉండని సాదాసీదా పనులు చేసేవాళ్లు)కు జీతాలు పెంచడంలో కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. పెట్రోలు ధరలు భారీగా పెరగడంతో బైక్ టాక్సీలు, ఈ–కామర్స్ డెలివరీల వైపు రైడర్లు (డెలివరీ ఉద్యోగులు) మళ్లుతున్నారు. కరోనా సమయంలో ఉద్యోగ అవకాశాలు లేక డెలివరీ రైడర్లుగా పనిచేసేందుకు చాలా మంది ముందుకు వచ్చారు.
ఇప్పుడు మంచి ఉద్యోగాలు వస్తుండటంతో వారు అటువైపు వెళ్లిపోతున్నారని స్టాఫింగ్ ఏజన్సీ టీమ్ లీజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రీతూపర్ణ చక్రబర్తి చెప్పారు. బెంగళూరు, ముంబై, న్యూ ఢిల్లీ వంటి సిటీలలో క్విక్ కామర్స్ఇండస్ట్రీలో గిగ్వర్కర్లకు డిమాండ్ విపరీతంగా ఉందని పేర్కొన్నారు.