రాజద్రోహ చట్టాన్ని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో, సమీక్ష పూర్తయ్యే వరకు కొత్త కేసులు పెట్టకుండా రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకూ ఉన్న రాజద్రోహం కేసులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది.
రాజద్రోహం కేసులన్నీ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు బుధవారం నాటి తీర్పులో ప్రకటిస్తూ, ఈ క్రమంలోనే రాజద్రోహం చట్టం కింద అరెస్టయిన వాళ్లంతా సంబంధిత కోర్టులలో బెయిల్ పిటిషన్ పెట్టుకోవచ్చని తెలిపింది.
రాజద్రోహం కేసుకు సంబంధించిన చట్టాలను పునః పరిశీలించాలని పేర్కొన్న సుప్రీం.. సెక్షన్ 124A కింద నమోదైన కేసులన్నింటినీ పునః పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజద్రోహం చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ చట్టాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు సుప్రీం నేటి తీర్పులో ప్రకటించింది.
ఇప్పటికే ఈ చట్టం కింద నమోదైన కేసుల గురించి ఎలాంటి వైఖరి అనుసరించబోతుందో స్పష్టం చేయాలని కోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ప్రస్తావించిన అంశాలపై కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరణఇస్తూ సమీక్ష పూర్తయ్యే వరకు ఈ చట్టం కింద కేసులు నమోదు చేయొద్దనేది సరైన విధానం కాదని పేర్కొన్నారు.
తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదు చేయకుండా ఉండలేమని స్పష్టం చేశారు. ప్రతి కేసు తీవ్రతను చెప్పలేమని, కొన్ని ఉగ్రకోణంలో ఉండొచ్చు.. మరికొన్ని మనీలాండరింగ్ కేసులు కావొచ్చని తెలిపారు. అయితే ఈ కేసులను పరిశీలించేందుకు ఎస్పీ ర్యాంక్ అధికారి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఎస్పీ ర్యాంకు అధికారి నేర తీవ్రతను పరిశీలించి ఆమోదిస్తే కేసు నమోదు చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తామని కోర్టుకు తుషార్ మెహతా తెలిపారు. పెండింగ్ కేసులను న్యాయపరమైన ఫోరమ్ ముందు పరిశీలించాలని వివరించారు.
అయితే కేంద్రం వాదనతో సీజేఐ జస్టిస్ ఎన్ .వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించలేదు. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్రం చెప్పిందని, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్లు వాదిస్తున్నారని తెలిపింది.
హనుమాన్ చాలీసా పఠించినా రాజద్రోహం అభియోగాలు మోపుతున్నారని అటార్నీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టంపై సమీక్ష పూర్తయ్యేంత వరకూ దేశద్రోహ చట్టం అమలు సరికాదని సుప్రీంకోర్టు. ఆదేశించింది.
అందువల్ల పున్ణపరిశీలన పూర్తయ్యేంతవరకు దీని అమలుపై స్టే విధిస్తున్నామని చెబుతూ అప్పటి వరకు ఈ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కొత్త కేసులు నమోదు చేయబోవని విశ్వసిస్తున్నామని, ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని అని సిజెఐ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు.