బీజేపీ ముఖ్యమంత్రి హిమంత శర్మ అనుకోకుండా నోరు జారి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను `ప్రధాన మంత్రి’ అని సంబోధించడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచారు. దీంతో కాంగ్రెస్ నేతలు సీఎంను లక్ష్యంగా చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
సీఎం హిమంత శర్మ అసోంలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ అదే వేదికపై ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను భారత ప్రధానిగా సంబోధిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని హోం మంత్రిగా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు విన్న సభలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
అయితే, సీఎం అనుకోకుండా నోరుజారారని, ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత సమర్ధించే ప్రయత్నం చేశారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఈ వీడియోలను ట్రోల్ చేస్తూ అధికార బీజేపీ తదుపరి ప్రధాని అభ్యర్థిగా అమిత్ షానే ఎంచుకుందని, ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ట్విట్టర్లో కామెంట్స్ చేసింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అంతకుముందు చోటుచేసుకున్న ఆసక్తికర వ్యాఖ్యలను కూడా జోడించింది. హిమంత శర్మ అసోం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నప్పుడు బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్.. శర్మను పదే పదే సీఎం అంటూ సంభోదించారు. కానీ, ఆ సమయంలో అసోం సీఎంగా శర్బానంద సోనోవాల్ కొనసాగుతుండటం విశేషం.
అయితే, ఎంపీ పల్లబ్ వ్యాఖ్యలకు ఆజ్యంపోస్తూ.. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో హిమంత శర్మ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అమిత్ షానే ప్రధాని అభ్యర్థి అవుతారని కాంగ్రెస్ పరోక్షంగా కామెంట్స్ చేసింది.