రష్యా నుంచి ఐరోపాకు నేచురల్ గ్యాస్ ను సరఫరా చేస్తున్న ఓ పైప్ లైన్లో సరఫరాను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. గ్యాస్ సరఫరాను ఆపేయడం నిజమేనని, దీనివల్ల కొంత ప్రభావం కూడా పడిందని రష్యన్ ప్రభుత్వ కంపెనీ గాజ్ ప్రామ్ తెలిపింది. అంతకుముందు రోజు కంటే ఐరోపాకు గ్యాస్ సప్లై 25 శాతం తగ్గినట్లు పేర్కొంది.
మరోవైపు ఈశాన్య ప్రాంతంలోని ఖార్కివ్ సిటీకి సమీపంలో నాలుగు గ్రామాల నుంచి రష్యన్ బలగాలను పారదోలి, తిరిగి స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ వెల్లడించింది. స్టేరీ సాల్టివ్ గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ బలగాలు మరో ఆరు మైళ్లు ముందుకు వెళ్లాయని, ప్రస్తుతం సరిహద్దుకు మరో 10 మైళ్ల దూరంలోనే ఉన్నాయని తెలిపింది.
ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద సిటీ అయిన ఖార్కివ్ కు సమీపంలో నాలుగు గ్రామాలను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ వెల్లడించారు. రష్యన్ సేనలను క్రమంగా ఖార్కివ్ నుంచి తరిమికొడుతున్నామని తెలిపారు.
నల్ల సముద్రంలో స్నేక్ ఐల్యాండ్లో సెటిలైన రష్యన్ బలగాలపై ఉక్రెయిన్ సైన్యం దాడులు కొనసాగిస్తోందని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. సముద్రంలో రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకు దీటుగా పోరాటం చేస్తోందని పేర్కొంది.
అయితే, నల్ల సముద్రంలో ఇప్పటికే రెండు కీలకమైన యుద్ధ నౌకలను కోల్పోయిన రష్యా.. ఒడెస్సా పోర్టు సిటీపై మళ్లీ దాడులు చేసింది. ఒడెస్సా నుంచి మరియుపోల్ మీదుగా డాన్బాస్ వరకూ కారిడార్ను ఏర్పాటు చేసుకునే లక్ష్యంతో రష్యా దాడులు కొనసాగిస్తోంది.
రష్యన్ ట్యాంకులను ఉక్రెయిన్ బలగాలు వరుసగా పేల్చివేస్తున్నాయి. రష్యాకు చెందిన అధునాతన టీ 90ఎం ట్యాంకును కూడా రాకెట్ లాంచర్తో పేల్చేసిన వీడియో ఫుటేజీని ఉక్రెయిన్ బుధవారం విడుదల చేసింది. ఖార్కివ్కు సమీపంలోని స్టేరీ సాల్టివ్ వద్ద ట్యాంకును పేల్చేసినట్లు వెల్లడించింది.
‘‘అత్యాధునిక టెక్నాలజీతో రష్యా తయారు చేసుకున్న రూ.38 కోట్ల విలువైన టీ90ఎం యుద్ధ ట్యాంకును.. జస్ట్ రూ.17 లక్షల విలువైన స్వీడిష్ రాకెట్ లాంచర్తో పేల్చివేశాం” అని పేర్కొంటూ ఉక్రెయిన్ రక్షణ శాఖ వీడియో ఫుటేజీ విడుదల చేసింది. ఇప్పటి వరకు యుద్ధంలో 1,170 రష్యన్ యుద్ధట్యాంకులను పేల్చేశామని, రష్యా వద్ద ఉన్న మొత్తం ట్యాంకుల్లో ఇవి 40 శాతం అని తెలిపింది.
మరోవణ్ణక, పశ్చిమ దేశాల ఆంక్షలతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నలుగురు రష్యన్ రీజినల్ గవర్నర్లు పదవులకు రాజీనామా చేశారు. టామ్స్క్, సరాటోవ్, కిరోవ్, మారీ ఎల్ గవర్నర్లు పదవుల నుంచి తప్పుకున్నారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని రైజాన్ రీజినల్ గవర్నర్ చెప్పారు. ఈ ఐదు రీజియన్లకు వచ్చే సెప్టెంబర్లో ఎన్నికలు జరుగనున్నాయి.