కర్ణాటక ప్రభుత్వం తుంగ, భద్ర నదులపై అక్రమంగా నిర్మించతలపెట్టిన రెండు భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు క్లియరెన్స్లు ఇవ్వవద్దని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి విజ్ఞప్తి చేసింది. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర ప్రాజెక్టుకు ఎగువన అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టుల నిర్మాణాలను ఎటువంటి నీటి కేటాయింపులు లేకుండానే చేపడుతోందని తెలంగాణ రాష్ట్ర నీటి శాఖ ఈఎన్సి మురళీధర్ కేంద్ర జలవనరుల సంఘం పరిధిలోని ప్రా జెక్టు అప్రయిజల్స్ డైరెక్టరేట్కు లేఖ రాశారు.
అనధికారింగా ప్రాజెక్టులు నిర్మిస్తూ దిగువ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న కర్ణాటక దూకుడుకు అడ్డుకట్ట వేయా ల ని లేఖలో కోరారు. అప్పర్ తుంగ ప్రాజెక్టు ద్వారా 20 టీఎంసీల నీటిని, అప్పర్ భధ్ర ప్రాజెక్టు ద్వారా 10 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ప్రాజెక్టులు చేపట్టిందని ఈఎన్సీ డైరెక్టరేట్ దృష్టికి తీసుకువచ్చారు.
జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు ప్రాజెక్టులకు ఎటువంటి నీటి కేటాయింపులు చేయలేదని ఆయన గుర్తు చేశారు. కర్ణాటక ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే ఆ రాష్ట్రానికి కేటాయించిన నీటికంటే ఎన్నో రెట్లు అధికంగా నీటిని వినియోగించుకుంటుందని తెలిపారు. నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తే ఆ ప్రభావం దిగువన ఉన్న తెలంగాణ రాష్ట్రంపైన పడుతుందని తెలిపారు.
అంతర్ రాష్ట్ర అంశాలు, ట్రిబ్యునల్ తీర్పులను పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వరాదని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులిస్తే తుంగభద్ర నుంచి కృష్ణానదికి నీటి ప్రవాహం తగ్గిపోతుందని తెలిపారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నదిలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా కర్నాటక రాష్ట్రానికి అదనంగా 61 టిఎంల నీటికేటాయింపులు చేసినప్పటికీ, బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇంకా అవార్డు కాలేదని గుర్తు చేశారు.
సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నందువల్ల తీర్పు అమల్లోకి వచ్చేదాక అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు క్లియరెన్సులు ఇవ్వరాదని కోరారు. కృష్ణా బేసిన్ పరిధిలో ఇప్పిటికే నీట లభ్యత తక్కువగా ఉందని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే తుంగభధ్ర నుంచి దిగువ రాష్ట్రాలకు రావాల్సిన నీటి ప్రవాహాలు మరింతగా తగ్గిపోతాయని ఆందోళన వెలిబుచ్చారు.
అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే సమయంలో కర్ణాటకకు దిగువన ఉన్న రాష్ట్రాల అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో ఆ రెండు ప్రాజెక్టులకు ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటి ఇచ్చిన అనుమతులను వెంటనే నిలిపి వేయాలని కేంద్ర జలసంఘానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ణప్తి చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులను నిలుపుదల చేయాని ఈఎన్సి మరళీధర్ లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.