పార్లమెంట్ లో కేవలం ఒకేఒక సభ్యుడుగా గల, నాలుగు సార్లు ప్రధానిగా వ్యవహరించిన రణిల్ విక్రమసింఘే శ్రీలంక తదుపరి ప్రధానమంత్రిగా గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఎస్ జె బి గోటబయ రాజపక్సే అధ్యక్షతన ప్రభుత్వంలో చేరడానికి నిరాకరించడంతో, విక్రమసింఘే ఏకైక ఎంపికగా మిగిలిపోయారు.
నాలుగుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన విక్రమసింఘేను 2018 అక్టోబర్లో అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధాని పదవి నుంచి తొలగించారు. అయితే, రెండు నెలల తర్వాత సిరిసేన ఆయనను మళ్లీ ప్రధానిగా నియమించారు.
అధికార శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ ఎల్ పి పి), ప్రధాన ప్రతిపక్షమైన సమగి జన బలవేగయ (ఎస్ ఎ బి)లోని ఒక వర్గంతో పాటు అనేక ఇతర పార్టీలు పార్లమెంటులో విక్రమసింఘేకు మెజారిటీ సాధించడానికి మద్దతును తెలిపినట్లు తెలుస్తున్నది.
2020 పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో పురాతన పార్టీ అయిన యు ఎన్ పి బలమైన కొలంబో నుండి పోటీ చేసిన విక్రమసింఘేతో సహా జిల్లాల నుండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. తరువాత సంచిత జాతీయ ఓటు ఆధారంగా తమ పార్టీకి కేటాయించిన ఏకైక జాతీయ జాబితా ద్వారా పార్లమెంటుకు వెళ్లారు.
ఆయన డిప్యూటీ సజిత్ ప్రేమదాస ఆయన నుండి విడిపోయిన ఎస్ ఎ బికి నాయకత్వం వహించి ప్రధాన ప్రతిపక్షంగా మారారు. విక్రమసింఘే దూరదృష్టి గల విధానాలతో ఆర్థిక వ్యవస్థను నిర్వహించగల వ్యక్తిగా విస్తృతంగా పేర్కొందారు. అంతర్జాతీయ సహకారాన్నిసమీకరింపగల శ్రీలంక రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు.
అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలనే డిమాండ్ తో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఒక వంక జరుగుతూ ఉండగా, ఈ వారం హింసాత్మక ఘర్షణల తరువాత ఎనిమిది మంది మరణించిన తరువాత ఆహారం, ఇంధన కొరతలతో నెల రోజులుగా నెలకొన్న సంక్షోభం కారణంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
గోటబయ సోదరుడు మహింద రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో క్యాబినెట్ రద్దుకు దారితీసింది. ఈ సంవత్సరం $8.6 బిలియన్ల రుణంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి, రుణదాతలతో చర్చలు జరపడానికి ఏ ప్రభుత్వమూ లేదు.
అధ్యక్షుడు రాజపక్సే “ప్రస్తుత పరిస్థితిని నియంత్రించడానికి, దేశం అరాచకం వైపు వెళ్లకుండా నిరోధించడానికి”, “పార్లమెంటులో మెజారిటీని సాధించగల, దేశ ప్రజల విశ్వాసాన్ని పొందగల” ఒక ప్రధాన మంత్రిని, మంత్రివర్గాన్ని నియమిస్తానని ప్రకటించారు.
సమైక్య జన బలవేగయ (ఎస్ జె బి) దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అని నొక్కిచెప్పిన శ్రీలంక ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడు రాణిల్ విక్రమసింఘేను ప్రధానమంత్రిని చేస్తే తమ పార్టీ తగు “వ్యూహాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు.
అంతకు ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయమని అధ్యక్షుడి ఆహ్వానానికి సమాధానంగా షరతులకు లోబడి శ్రీలంకలో కొత్త మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమగి జన బలవేగయ నేతృత్వంలోని ప్రతిపక్షం సుముఖంగా ఉందని 55 ఏళ్ల ప్రేమదాస రాష్ట్రపతికి రాసిన లేఖలో తెలిపారు.
సాజిత్ ప్రేమదాస ప్రతిపాదించిన షరతుల్లో ఒకటి రెండు వారాల్లోగా అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో 19వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలి. ఇంకా, అధ్యక్షుడు గోటబయ నిర్ణీత గడువులోగా రాజీనామా చేయాలి. రాజ్యాంగంలోని 21వ సవరణ ద్వారా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీని రద్దు చేసేందుకు రాష్ట్రపతి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పని చేయడం మూడవ షరతు.
నాల్గవ షరతు ఏమిటంటే, పైన పేర్కొన్న రాజ్యాంగ సంస్కరణల అమలును అనుసరించి, చట్టబద్ధమైన పాలనను స్థాపించి, ప్రజల జీవితాలను సాధారణ స్థితికి తీసుకు రావడానికి ప్రజలకు కొత్త స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించడానికి రాష్ట్రపతి పార్లమెంటు ఎన్నికలకు పిలుపునివ్వాలి.
ఇలా ఉండగా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాన్ని పీడిస్తున్న దారుణమైన ఆర్థిక సంక్షోభం కారణంగా కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య శ్రీలంక పార్లమెంట్ మే 17న అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చిస్తుందని స్పీకర్ కార్యాలయం ధృవీకరించింది. గురువారం జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు నుండి ప్రత్యేక ఆమోదం పొందిన తర్వాత తీర్మానం చర్చకు తీసుకుంటారు.
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక సవాళ్లను అధిగమించడమే మన ముందున్న కర్తవ్యమని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే త్లుత ట్వీట్ చేశారు. విచ్చిన్నకర యత్నాలను తోసిపుచ్చుతూ, శాంతి, సామరస్యతలను కాపాడుకునే దిశగా కదలాలని కోరారు. ప్రస్తుత పరిస్థితి చాలా సునిుతంగా వునుందున భద్రతపై అందరికీ భయాందోళనలు నెలకొన్నాయని, ఈ దశలో వచ్చే వారం పార్లమెంట్ను తిరిగి సమావేశపరచడం కూడా కష్టం కావచ్చని పార్లమెంటరీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా, శ్రీలంక మాజీ ప్రధాని మహిందా రాజపక్స, ఆయన మద్దతుదారులు విదేశాలకు వెళ్లకుండా ఫోర్ట్ మెజిస్ట్రేట్ కోర్టు నిషేధం విధించింది. మహిందాతో పాటు ఆయన కుమారుడు, ఎంపి నమల్ రాజపక్సలపై కూడా నిషేధం విధిస్తున్నట్లు శ్రీలంక కోర్టు ప్రకటించింది.