అమెరికాలో కరోనా మరణాలు 10 లక్షలు దాటాయి. అధ్యక్షులు జో బైడెన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది ఒక ‘విషాదకరమైన మైలురాయి’ అని, మహమ్మారి ఇంకా కొనసాగుతున్నందు వల్ల జాగ్రత్తగా ఉండాలని అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
రాయిటర్స్ గణాంకాల ప్రకారం అమెరికాలో బుధవారం నాటికి కరోనా మరణాలు 10 లక్షలకు చేరుకున్నాయి. అంటే ప్రతి 327 మంది అమెరికన్లలో ఒకరు మరణించారన్నమాట. అలాగే కరోనా మరణాల సంఖ్య శాన్ఫ్రాన్సిస్కో లేదా సీటెల్ నగరాల్లోని జనాభా కంటే అధికం.
దేశంలో కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు దాటడటంతో సంతాప సూచకంగా వైట్హౌస్పై జెండాను అవనతం చేశారు. రెండో గ్లోబల్ కోవిడ్-19 సమ్మిట్ గురువారం జరగబోతోంది. మరోవైపు కోవిడ్తో పోరాటం కొనసాగించేందుకు మరిన్ని నిధులు ఇవ్వాలని కాంగ్రెస్ను బైడెన్ అభ్యర్థించారు.
‘మనం ఈ మహమ్మారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. గతంలో లేని విధంగా ఎక్కువ పరీక్షలు, టీకాలు, చికిత్సలు చేయాల్సి ఉంది. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను రక్షించడానికి మనం చేయగలిగినదంతా చేయాలి’ అని బైడెన్ తెలిపారు.