దేశంలో రెండేళ్లలోపు పిల్లల్లో89 శాతం మందికి కనీస పౌష్టికాహారం లభించడం లేదు. గర్భస్థ శిశువు దగ్గర్నుంచీ రెండేళ్ల పిల్లాడు అయ్యేంత వరకు వారికి పోషకాహారం అందటం అత్యంత కీలకమైంది. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మానసిక, శారీరక ఎదుగుదల సరిగా ఉండదు. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
దేశంలో 6 నుంచి 23 నెలల చిన్నారుల్లో 89 శాతం మందికి కనీసంలో కనీసం పోషకాహారం (మినిమం డైట్) అందటం లేదని ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5’ (ఎన్ఎఫ్హెచ్ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. నిర్దేశిత ప్రమాణాలమేరకు కనీస పౌష్టికాహారం పొందని శిశువులు, చిన్నారులు 2015-16లో 91.3శాతముంటే, 2019-20లో 89 శాతంగా నమోదైందని తాజా సర్వే పేర్కొన్నది.
గణాంకాల్లో స్వల్ప మెరుగుదల ఉన్నా, పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని సర్వే తేల్చింది. సమాజంలో పేదరికం, అవిద్య, అవగాహనా లోపం, పప్పులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు అందుబాటులో లేకపోవటం.. వంటివి సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నాలుగు ఆహార గ్రూపుల్లో కనీసం రెండు ఆహార గ్రూపులు చిన్నారులకు అందితే..దానిని ‘మినిమం డైట్’గా పేర్కొంటారు. మనదేశంలో 35 శాతం మంది నవజాత శిశువులకు తల్లిపాలు సమృద్ధిగా అందుతున్నాయి. శిశువుల్లో 25 శాతం మందికి భిన్నమైన ఆహారం దక్కుతోంది. ఈ అంశాలకు సంబంధించి ఎన్ఎఫ్హెచ్ఎస్-4 సర్వేతో పోల్చితే ఎన్ఎఫ్హెచ్ఎస్-5 సర్వేనాటికి గణాంకాల్లో పెద్దగా మార్పులేదు.
గర్భస్థ శిశువు, చిన్నారులకు పోషకాహారం అందుబాటులో లేకపోతే ముందు ముందు అనేక దుష్ఫరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచంలో పోషకాహారం పొందలేని బాలలు అత్యధికంగా భారత్లో ఉన్నారు. తాజా సర్వే ప్రకారం, మినిమం డైట్ పొందుతున్న శిశువులు, చిన్నారులు (6-23నెలలు) ఉత్తరప్రదేశ్, గుజరాత్లో 5.9శాతం మంది మాత్రమే ఉన్నారు. అత్యధికంగా మేఘాలయలో 28.5శాతం నమోదైంది.
కనీస పోషకాహార లభ్యతలో మేఘాలయ, కేరళ (23.3శాతం), సిక్కిం (23.8శాతం), లడఖ్ (23.1శాతం), పుదుచ్చెరీ (22.9శాతం) రాష్ట్రాలు మెరుగైన గణాంకాలు నమోదు చేశాయి. జాతీయ సగటు 11శాతం కన్నా దిగువన ఉన్న రాష్ట్రాలు తెలంగాణ-9శాతం, అసోం-7.2శాతం, రాజస్థాన్-8.3శాతం, మహారాష్ట్ర-8.9 శాతం, ఏపీ-9శాతం.