ప్రపంచ కుబేరుడు,టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనూహ్యమైన ప్రకటన చేశారు. 44 బిలియన్ డాలర్ల (రూ.3.3 లక్షల కోట్లు పైమాటే) విలువైన ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు వెల్లడించారు.
స్పామ్, నకిలీ ఖాతాలు 5 శాతం కన్నా తక్కువ ఉంటాయన్న లెక్కలకు సంబంధించి వివరాలను ఇంకా అందజేయలేదని, దీంతో కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు మస్క్ ట్వీట్ చేశారు. దీంతో మార్కెట్ ట్రేడింగ్లో ట్విటర్ కంపెనీ షేర్లు 20 శాతం పడిపోయాయి.
అయితే ఈ అంశంపై ట్విటర్ అధికారికంగా స్పందించాల్సి వుంది. మొదటి త్రైమాసికంలో నగదు ఆర్జించే రోజువారీ క్రియాశీల వినియోగదారులు, స్పామ్ ఖాతాలు 5 శాతం కంటే తక్కువ ఉంటాయని కంపెనీ ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది.
మస్క్తో ఒప్పందం ముగిసే వరకు ప్రకటనదారులు ట్విటర్లో కొనసాగాలా వద్దా అనే నిర్ణయంతో పాటు కంపెనీ పలు నష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపింది.మరోవైపు స్పామ్ లేదా నకిలీ ఖాతాలను ట్విటర్ నుంచి తొలగించడం తన ప్రథమ ప్రాధాన్యత అని ఎలాన్ మస్క్ వివరించారు.
మరోవంక, ట్విటర్ సంస్థలో అనూహ్యమైన మార్పులు జరిగాయి. సంస్థకు చెందిన ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్లను తొలగించింది. ఎలన్ మస్క్ 44 మిలియన్ డాలర్ల భారీ డీల్తో ట్విటర్ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన అనంతరం ట్విటర్ సిఇఒ పరాగ్ అగ్రవాల్ను తొలగిస్తార్న వార్తలు వినిపించాయి.
అయితే అనూహ్యంగా ట్విటర్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్గా పని చేస్తున్న టాప్ ఎగ్జిక్యూటివ్ బెక్పూర్ని సంస్థను వీడి వెళ్లాల్సిందిగా సిఇఒ పరాగ్ అగర్వాల్ ఆదేశించారు. అలాగే రెవెన్యూ హెడ్ బ్రూస్ ఫలాక్ను తొలగించారు. ట్విటర్ సిఇఒ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారంటూ బెక్పూర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంత కాలం ట్విటర్లో సాధించిన లక్ష్యాల పట్ల తాను గర్వంగా ఉన్నానని, ట్విటర్ను వెళ్లి వీడాల్సిన రోజు వస్తుందని తాను ఊహించలేదంటూ బెక్పూర్ ట్వీట్ చేశారు. రెవెన్యూ హెడ్గా బ్రూస్ ఫలాక్ను కూడా ఆ స్థానం నుండి తొలగిస్తున్నట్లు మొదట ట్విటర్లో ప్రకటించారు. అనంతరం ఆ ట్వీట్ను తొలగించినా ఫలాక్ను మాత్రం కీలక బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. కీలకమైన ఈ రెండు బాధ్యతలను జే సల్లివాన్కి అప్పగించారు.