తెలుగు దేశంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్యెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ కు దారితీసింది. సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో ఉజ్వలా ఫౌండేషన్ పేరుతో విల్లాల నిర్మాణంలో జరిగిన అక్రమాలను అరికట్టాలని జెసి.ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ అక్రమాలపై జిల్లా కలెక్టరుకు వినతిపత్రం ఇచ్చేందుకు శుక్రవారం ఆయన అనంతపురం నుంచి పుట్టపర్తికి బయల్దేరారు. ప్రభాకర్రెడ్డి పుట్టపర్తికి వెళ్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న పేరుతో.. జాతీయ రహదారి 44 మరూరు టోల్గేట్ వద్ద అనంతపురం పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్టు చేశారు. రాప్తాడు స్టేషన్కు తరలించారు. అనంతరం విడుదల చేశారు.
జెసి ప్రభాకర్రెడ్డి పుట్టపర్తికి వెళ్తున్నారని తెలిసి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకులు పల్లె రఘునాథ్రెడ్డి అనుచరులు కొత్తచెరువు, పుట్టపర్తిలో నిరసనకు దిగారు. ‘జెసి.ప్రభాకర్రెడ్డి గోబ్యాక్’ అంటూ ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ వ్యవహారంతో జెసి.ప్రభాకర్రెడ్డి, పల్లె రఘునాథరెడ్డిల మధ్య ఉన్న తగాదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం జెసి ప్రభాకర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీ అవినీతిని ప్రశ్నిస్తుంటే అడ్డుకునేందుకు పల్లె రఘునాథరెడ్డి ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు. పుట్టపర్తికి చెందిన కొందరు బాధితులు తన వద్దకు వచ్చినందునే వారి తరపున కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వటానికి తాను ప్రయత్నం చేశానని చెప్పారు.
ఈ విషయంపై పల్లె రఘునాథరెడ్డి స్పందిస్తూ ఉజ్వాల ఫౌండేషన్ అక్రమాలపై తాను ఇది వరకే కలెక్టర్కు ఫిర్యాదు చేశానని, దానిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా జెసి.ప్రభాకర్రెడ్డి వేలు పట్టే ప్రయత్నం చేయడం సరైంది కాదనని స్పష్టం చేశారు. అయితే, ఆయనకు, తనకు మధ్య ఎలాంటి విభేదాల్లేవని చెప్పారు.