దేశంలో పుష్కలంగా బొగ్గు ఉత్పత్తులు కొనసాగుతున్నా బొగ్గు సరఫరా సరిగ్గా లేక దేశ వ్యాప్తంగా ధర్మల్ విద్యుత్ సరఫరా పెను సంక్షోభం ఎదుర్కొంటున్నది. ఇటువంటి పరిస్థితులలో అవసరాలమేరకు బొగ్గు సరఫరా చేయలేమని కేంద్రం చేతులు ఎత్తేసింది.
కావాలంటే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గును కొనుగోలు చేసుకోమని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. నేడు దేశంలో అనేక రాష్ట్రాల్ని బొగ్గు కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాంతో ప్రయివేటుగా అధిక ధర చెల్లించి రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది.
విద్యుత్ కోతలు పెరిగితే..ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని, ఆదాయం గణనీయంగా పడిపోతుందని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. బొగ్గు కొరతపై పది రోజుల క్రితం కేంద్రం రాసిన లేఖతో ఏం చేయాలో రాష్ట్రాలకు దిక్కుతోచటం లేదు. ”మీకున్న మొత్తం బొగ్గు అవసరాల్లో..10శాతం అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు చేసుకోండి. తద్వారా మీ బొగ్గు సమస్యను పరిష్కరించుకోండి” అన్నది ఆ లేఖలో సారాంశం.
కేంద్రం చూపిన పరిష్కారం పట్ల నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటె అంతర్జాతీయ మార్కెట్ నుంచి బొగ్గును కొనుగోలు చేయటమన్నది జెన్కోలకు సంబంధం లేని వ్యవహారం. అది నాణ్యమైన బొగ్గా..కాదా? ఎంత ధర పెట్టాలి? ఎంత పరిణామంలో కొనాలి? వాటి దిగుమతి ఛార్జీలు, రవాణా, ఇతర సుంకాలు..ఇలా అనేక విషయాలు జెన్కో తేల్చలేదు.
దిగుమతి ద్వారా బొగ్గు సేకరించే అనుభవం జెన్కోలకు లేదు. దాంతో కొనుగోలు చేయడానికి ముందుకువెళ్తే మోసపోయే అవకాశమే ఎక్కువ. వేసవి సమయం కాబట్టి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని అమ్మకం దార్లు చెప్పినట్టు ఆడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలోకి రాష్ట్రాలను నెట్టకూడదు. బొగ్గు కొరతను ఎదుర్కొనే పద్ధతి ఇది కాదని స్పష్టం చేస్తున్నారు.
మనదేశంలో బొగ్గు గనులు అపారంగా ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు గనుల తవ్వకాల్ని ప్రయివేటుకు, కార్పొరేట్కు అప్పజెపుతున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. అంతగా చేస్తుంటే, ఇప్పుడు కొరత ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పలేకపోతున్నారు. రైల్వే శాఖకు, గనుల శాఖకు సమన్వయం లోపించడమే సమస్యకు ప్రధాన కారణంగా విమర్శలు తలెత్తుతున్నాయి.
సరిపోయినన్ని రైల్వే వ్యాగన్లు లేక బొగ్గు రవాణా స్తంభించిపోయిందన్న వాదన ఉంది. ప్రతి రోజూ బొగ్గు రవాణాకు 441 రైల్వే వాగన్లు అవసరంకాగా, రైల్వే శాఖ 405 వ్యాగన్లు సమకూరుస్తోంది. మొత్తంగా బొగ్గు సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వ సన్నద్ధత లోపించిందని స్పష్టం అవుతున్నది. ఇంతగా సంక్షోభం తలెత్తుతున్న దృష్ట్యా ప్రధాని మోదీ జోక్యం చేసుకొని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్యకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా పలువురు కోరుతున్నారు.
కోల్ ఇండియా ద్వారా కేంద్రానికి 2016లో రూ.35వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నిధులతో కొత్త గనుల తవ్వకం చేపట్టవచ్చునని, ప్రస్తుతం ఆపరేషన్లో ఉన్న గనుల వద్ద తవ్వకాల్ని విస్తరించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కోల్ ఇండియా సీఎండీ పోస్ట్ ఎన్నో ఏండ్లుగా ఖాళీగా ఉంది.
నేడు దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎన్నో ఏండ్ల క్రితం నిర్మించినవి. ఇప్పుడు వీటికి దిగుమతి చేసిన బొగ్గు సరఫరా చేస్తే అనేక సమస్యలు వస్తాయని, థర్మల్ కేంద్రాల్లో బాయిలర్లలో విపరీతంగా వేడెక్కి, ట్యూబ్లు లీకయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.