వైసిపి ఎంపిక చేసిన నలుగురు రాజ్యసభ అభ్యర్థులలో ఇద్దరు తెలంగాణ ప్రాంతంకు చెందినవారే కావడం గమనార్హం. వారిలో ప్రముఖ బిసి నాయకుడు ఆర్ కృష్ణయ్య కూడా ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా టిడిపిలో చేరి, ఎల్బీ నగర్ నుండి తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసి, టిడిపి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన బిసి సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు.
అయిన టిడిపి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజ్యసభ ఎన్నికలలో వైసిపి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అదే విధంగా తెలంగాణకు చెందిన సుప్రీం కోర్ట్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ని ఎంపిక చేశారు. ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులలో ఎదుర్కొంటున్న అవినీతి కేసులలో ఆయన తరపున వాదిస్తున్నారు.
వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వరుసగా రాజ్యసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఆయనతో పాటు నెల్లూరు జుల్లకు చెందిన బిసి నాయకుడు బీద మస్తాన్రావును కూడా ఎంపిక చేశారు. ఆయన కూడా టిడిపి నుండి ఇదివరలో వైసీపీలో చేరిన వారే కావడం గమనార్హం.
రాజ్యసభ అభ్యర్థుల జాబితాను మీడియాకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటిస్తూ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో అన్ని అంశాలను పరిశీలించి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేశారని చెప్పారు. పరిపాలన, నిమినేటెడ్ స్థానాల్లో బలహీనవర్గాలకు అవకాశం కల్పించి వారిని పైకి తీసుకురావాలన్నదే జగన్ ఆలోచన అని బొత్స పేర్కొన్నారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ అనేది సీఎం అభిప్రాయమని చెప్పారు. భవిష్యత్తులో మహిళలకు జగన్ ప్రాధాన్యమిస్తారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా సమాన అవకాశాలు ఉండాలనేది సీఎం విధానమని పేర్కొన్నారు. మూడేళ్లలో అన్నింటా సామాజిక న్యాయాన్ని అమలు చేసి జగన్ నిబద్ధత పాటించారని చెప్పారు.