శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మంగళవారం పార్లమెంటులో వీగిపోయింది. తమిళ్ నేషనల్ అలయెన్స్ ఎంపీ ఎంఏ సుమంతిరన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది ఎంపీలు ఓటు వేయడంతో ఈ తీర్మానం వీగిపోయింది.
రాజపక్సపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చర్చించేందుకు వీలుగా పార్లమెంటు స్టాండింగ్ ఆర్డర్స్ను సస్పెండ్ చేయాలని ఈ తీర్మానం కోరింది. ఈ తీర్మానానికి అనుకూలంగా కేవలం 68 మంది ఎంపీలు మాత్రమే ఓటు వేసినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసనను పార్లమెంటులో ప్రతిబింబించాలని ప్రతిపక్షాలు భావించాయి.
ప్రధాన ప్రతిపక్షం ఎస్జెబి ఎంపి లక్ష్మన్ కిరియెల్లా కూడా ఈ అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. అయితే ప్రధాని విక్రమసింఘె మాత్రం అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు సమాచారం. శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమ్ సింఘె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం శ్రీలంక పార్లమెంట్ మొదటిసారి సమావేశమైంది. డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకునేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది.
ఈ సందర్భంగా అధ్యక్షుడు గొటబయ రాజపక్సాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోవడానికి మాజీ ప్రధాని మహింద రాజపక్సా, గొటబయ రాజపక్సాలు కారణమంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో మహింద తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ తాజా పరిణామంతో గొటబయ రాజపక్సాకి కొంత ఊరట లభించినట్లయింది.