వైసీపీ సర్కార్ ఛార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేపట్టిన `బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వస్థలమైన కడప జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజులపాటు పర్యటిస్తూ జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. కడపలో వైసీపీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకొంటూ ప్రజల నాది చూస్తుంటే జగన్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలుస్తుందని స్పష్టం చేశారు.
బాదుడే బాదుడు ప్రతి ఇంటికి చేరిందని, కడప లో ఉత్సహం రెట్టింపు అయిందని చెబుతూ గత మూడు సంవత్సరాల్లో జగన్ అరాచకాలు అంతా ఇంత కాదని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా బాదుడే బాదుడు కొనసాగుతోందని, జగన్ పాలనలో వీర బాదుడు చెస్తున్నాడని విమర్శించారు.
శ్రీలంక లో రాజపక్సేని ప్రజలు తరిమి కొట్టారని గుర్తుచేస్తూ ఏపీ లో కూడా జగన్ కు అలాంటి పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అడ్డంకులు కలిగించి ఉంటే ఇడుపులపాయ నుంచి బయటికి వచ్చే వాడు కాదని అంటూ నియంతలు అందరూ కాలగర్భం లో కలిసిపోయారని చంద్రబాబు హెచ్చరించారు.
వైసీపీ హయాంలో అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చంద్రబాబు ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక కడపతో పాటు రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. దీపం పథకం కింద వంటగ్యాస్ లు ఇస్తే జగన్ సీఎం అయ్యాక దీపం ఆర్పేశాడని చంద్రబాబు ఆరోపించారు.
ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు వారికి అండగా నిలబడాలని మాజీ ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని చెబుతూ కర్నూల్ లో సోలార్ పార్క్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, గతంలో తాను సీఎంగా ఉండగా ఓసారి శంకుస్థాపన చేస్తే దాన్ని మళ్ళీ ప్రారంభించారని ఆక్షేపించారు.
మూడు సంవత్సరాల్లో సోలార్ ప్రాజెక్టు పూర్తి చేసుంటే ఇప్పుడు విద్యుత్ కోతలు ఉండేవి కాదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని పెట్రోల్ , విద్యుత్ ధరలు ఇక్కడ ఉన్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ట్యాక్స్ వేస్తూ బాదుడే బాదుడు చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరినీ ఒకటి చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని టిడిపి అధినేత పిలుపిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ 8 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత సీఎం జగన్ ది అని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి కేంద్రం కూడా వెనకడుగు వేసిందని పేర్కొన్నారు.
తండ్రిని అడ్డుపెట్టుకుని రూ 43 వేల కోట్లు అవినీతి చేసిన జగన్, పాదయాత్రలో ముద్దులు పెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు ప్రజలకు గుద్దులే గుద్దులు ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని తెలిపారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తే దానికి మళ్ళీ జగన్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.స్టీల్ ప్లాంట్ ను పూర్తి చేయలేని జగన్కేవలం స్టిక్కర్ ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు. రాయలసీమ రాళ్ళ సీమగా మారకూడదని అప్పట్లో ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు తెచ్చారని గుర్తు చేశారు.
రాయలసీమ సస్యశ్యామలం గా ఉండాలని ఎన్నో ప్రాజెక్టులు తెచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. గండికోట లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇంతవరకు సీఎం జగన్ ఇవ్వలేదని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెరు పెట్టి ఉన్న ప్రాజెక్టులు పోగొట్టే పరిస్థితి ప్రస్తుతం ఉందని హెచ్చరించారు.