రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రసంగంను 2022-23 విద్యా సంవత్సరం నుండి కర్నాటక పాఠ్య పుస్తకాలలో పదవ తరగతి విద్యార్థులకు మొదటి భాషా సిలబస్లో చేర్చారు. రచయిత రోహిత్ చక్రతీర్థ నేతృత్వంలోని పాఠ్యపుస్తక పునర్విమర్శ కమిటీ మార్చిలో ఆ మేరకు సిఫార్సు చేసింది.
“నిజవాడ ఆదర్శ పురుషుడు యరాగాబేకు?” అనే శీర్షికతో. (నిజమైన మార్గదర్శిగా ఎవరు ఉండాలి?) కన్నడ గద్య పాఠ్యపుస్తకంలో భాగంగా దీనిని ముద్రిస్తున్నారు. ఈ కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
సిద్ధాంత పరంగా ఈ ప్రసంగాన్ని జోడించడం లేదని, పైగా అందుకోసం ఏ రాజకీయ పార్టీ లేదా సంస్థ నుండి ఎటువంటి ఒత్తిడి లేదని చక్రతీర్ధ స్పష్టం చేశారు. విద్యార్థులపై ఏ సంస్థ భావజాలాన్ని విధింపచేసే ప్రయత్నం కూడా కాదని తెలిపారు.
“మేము హెడ్గేవార్ను ఓ రచయితగా ఎంచుకున్నాము. ఆయన భావజాలం లేదా సంస్థ ఆధారంగా కాదు” ఓ వార్త సంస్థకు తెలిపారు. కాగా, ఈ సందర్భంగా కొన్ని పాఠాలను తొలగించారు. ఆ విధంగా తొలగించిన వాటిల్లో కర్ణాటక రచయిత, పాత్రికేయురాలు లంకేష్ రచనలు, “మృగ మట్టు సుందరి”, వామపక్ష ఆలోచనాపరుడు జి. రామకృష్ణ రచన “భగత్ సింగ్” ఉన్నాయి.
వాటి స్థానంలో, రచయిత శివానంద కలవే రచన “స్వదేశీ సూత్రదా సరళహబ్బ”, ఎం. గోవింద పాయ్ రచన “నాను ప్రస బిత్త కథే” లను చేర్చారు. తొలగించిన ఇతర పాఠాలలో సారా అబూబకర్ రచన “యుద్ధ”, ఎఎన్ రావు రచన “వ్యాఘ్ర కథ”, శివకోట్యాచార్య రచన “సుకుమారస్వామి కథ” ఉన్నాయి.
వేద పండితుడు స్వర్గీయ బన్నంజెగోవిందాచార్యుల రచన “సుకనాశన ఉపదేశం”, శతావధాని ఆర్. గణేష్ రచన “శ్రేష్ఠభారతీయ చింతనగన” లను చేర్చారు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ పద్యాలతో పాటు అలీనోద్యమం, ప్రచ్ఛన్న యుద్ధం యుగం, ఆఫ్రో-ఏషియాన్టెరిటరీస్లో ఇస్లామిక్ సామ్రాజ్యాల పెరుగుదల, మొఘల్ కోర్టుల చరిత్రలు, పారిశ్రామిక విప్లవం వంటి వాటిని సీబీఎస్ఇ 11, 12 తరగతుల పొలిటికల్ సైన్స్ సిలబస్ నుండి తొలగించారు.