ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరుల అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను రూపొందించింది. అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఓ మొబైల్ యాప్ను రూపొందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ యాప్ రూపొందించారు.
దీంతో అవినీతి నిరోధక శాఖ ‘14400 యాప్’ను రూపొందించింది. అవినీతిపై ఫిర్యాదుల కోసం ఏసీబీ కొంతకాలంగా 14400 టోల్ఫ్రీ నంబర్ను నిర్వహిస్తోంది. ఈ నంబర్తో ఫిర్యాదు మాత్రమే చేయగలరు. టోల్ఫ్రీ నంబరుకు వచ్చే ఫోన్ కాల్స్పై ఏసీబీ అధికారులు స్పందించి తరువాత ఆకస్మిక దాడులు, తనిఖీలు చేస్తారు.
కొందరు అధికారులు సిబ్బంది లంచాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేరుగా లంచాలు తీసుకోకుండా తమ ఏజెంట్లకు ఇవ్వమని చెబుతున్నారు.
ఇలాంటి సమస్యలకు ముగింపు పలుకుతూ అవినీతిని తక్షణం ఆధారసహితంగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించేందుకు వీలుగా 14400 యాప్ను ఏసీబీ రూపొందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. జిల్లా, మున్సిపాలిటీ, మండల, పంచాయతీ స్థాయిలో ఈ యాప్ వినియోగంపై అవగాహన సదస్సులు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అవగాహన కల్పిస్తారు.
14400 మొబైల్ యాప్లో ‘లైవ్ రిపోర్ట్’ ఉంటుంది. అధికారులు, సిబ్బంది లంచాలు అడుగుతున్నా, ఇతర అవినీతికి పాల్పడుతున్నా ఆ యాప్లో లైవ్ రిపోర్టింగ్ ఫీచర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లైవ్ రిపోర్టింగ్ ఫీచర్లో ఫొటో, వీడియో, ఆడియో, ఫిర్యాదు నమోదు ఆప్షన్లు ఉన్నాయి.
లంచం అడుగుతున్నప్పుడు మాటలను లైవ్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేయవచ్చు. లైవ్ వీడియో కూడా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. అనంతరం లాడ్జ్ కంప్లైంట్ (ఫిర్యాదు నమోదు) ఆప్షన్లోకి వెళ్లి సబ్మిట్ ప్రెస్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేరుతుంది. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు.