ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసులో జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ను ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు గురువారం దోషిగా తేల్చింది. ఈ నెల 25వ తేదీన యాసిన్ మాలిక్ కు న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశారన్న కేసులో పటియాల ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
టెర్రర్ ఫండింగ్ కేసులో తనపై నమోదైన అన్ని అభియోగాలను యాసిన్మాలిక్ అంగీకరించాడని తెలుస్తోంది. యాసిన్ మాలిక్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలని, అతడి ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ ఇవ్వాలని కోర్టు ఎన్ఐఏను ఆదేశించింది.
ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ సహా పలువురు వేర్పాటువాద నేతలపై ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది.
జమ్ముకశ్మీర్లో సంఘ విద్రోహ కార్యకలాపాలు నడిపేందుకు నిధులు సమీకరించినట్లు యాసిన్ మాలిక్పై ఆరోపణలు ఉన్నాయి. 2017కు సంబంధించిన ఈ కేసులో మాలిక్ పై ఢిల్లీ కోర్టులో ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసింది.
నేరాభియోగం నమోదైన నేపథ్యంలో మాలిక్ క్షమించాలని కోరారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద, చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం మాలిక్.. ‘ఫ్రీడమ్ స్ట్రగుల్’ పేరుతో నిధుల సమకూర్చాడని దర్యాప్తులో తేలింది. దీనికోసం ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
జమ్ములో జరిగే వేర్పాటువాద కార్యకలాపాల్లో జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) ముందుస్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండిట్ల హత్యల్లోనూ జేకేఎల్ఎఫ్ నాయకుల పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. వీరి దురాగతాలతో కశ్మీర్ నుంచి భారీ సంఖ్యలో పండిట్లు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ జేకేఎల్ఎఫ్ కు సంబంధాలు ఉన్నాయి.