తూర్పులద్దాఖ్లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద వివాదాస్పద వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా మరో వారధి నిర్మాణం చేపట్టింది. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైందని అంతర్జాతీయ నిఘా రంగ నిపుణులు డేమియన్ సైమన్ ట్విటర్లో తెలిపారు. అందుకు సంబంధించిన చిత్రాలను కూడా ఆయన పంచుకున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సైన్యాన్ని సమీకరించేందుకు ఈ వారధులు చైనాకు ఉపకరిస్తాయని రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. మొదటి దానికంటే పెద్దదైన ఈ రెండో బ్రిడ్జి, ఎల్ఏసీని దాటి ఏకంగా 20 కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు తెలుస్తోంది.
లడఖ్ నుండి సిక్కిం వరకు విస్తరించి ఉన్న భారత్ చైనా సరిహద్దు వెంబడి అనేక కీలక ప్రదేశాల్లో చైనా అక్రమ నిర్మాణాలను చేపడుతోందని తరచూ సాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. వారి వాహనాలు, ఇతర అవసరాల కోసం మౌలిక సదుపాయాల నెట్వర్క్ ను విస్తరిస్తున్నట్లు తాజాగా వెలువడ్డ ఉపగ్రహ చిత్రాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
పాంగాంగ్ సరస్సు వద్ద పెద్ద ఎత్తున వంతెన నిర్మాణం చేపట్టడం కూడా ఈ శాటిలైట్ ఫొటోల్లో చూడొచ్చు. భారత ప్రభుత్వం ఈ అక్రమ నిర్మాణాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నదని చెప్పారు.
“60 ఏండ్ల క్రితం దురాక్రమణ చేసుకున్న ప్రాంతంలో చైనా బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్లు తెలుస్తున్నది. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు” అని స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని ఆయన హెచ్చరించారు.
ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చైనా దురాక్రమణలు చేస్తున్నా భారత ప్రభుత్వం గమ్మునుండిపోతోంది కానీ, రాష్ట్రాల అధికారాలను ఎట్లా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలు చేస్తోందని విమర్శలు చేయడం గమనార్హం.
చైనా గత నెలలో పాంగాంగ్ పాత వంతెనను పూర్తి చేసి.. ఇప్పుడు పాంగోంగ్ సరస్సు యొక్క ఉత్తర, దక్షిణ భాగాలను కలుపుతూ కొత్త నిర్మాణాన్ని చేపట్టింది. ఇవన్నీ తాజాగా రిలీజ్ అయిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే చైనా చేపట్టిన ఈ కొత్త నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. అదికూడా మునుపటి వంతెన కంటే బాగా విశాలంగా ఉన్నట్టు తెలుస్తోంది. పాతదానికి సమాంతరంగా నిర్మాణంలో ఉన్న పక్కనే జరుగుతున్న పనులు ఈ సంవత్సరం మార్చి చివరి నుండి ఏప్రిల్ ప్రారంభంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఈ ప్రాంతంలో చైనా భూ బలగాల కార్యకలాపాలకు కొత్త నిర్మాణం స్థానం వ్యూహాత్మకంగా సాగుతోంది. తూర్పు లడఖ్ సమీపంలో చైనా నిర్మాణాలను భారత ప్రభుత్వం ‘చట్టవిరుద్ధం‘గా పలుసార్లు స్పష్టం చేసింది. పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది.
1962 నుండి చైనా అక్రమ ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ అక్రమ ఆక్రమణను ఎన్నడూ అంగీకరించలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంట్లో చెప్పారు.
ఇరు పక్షాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్ , చైనా అనేక రౌండ్ల సైనిక స్థాయి చర్చలతో పాటు దౌత్య సమావేశాలను నిర్వహించాయి. అయినప్పటికీ అనేక ప్రదేశాల్లో వాస్తవ నియంత్రణ రేఖ సమీపంలో కొత్త నిర్మాణాన్ని ఆపడంలో ఈ చర్చలు విఫలమయ్యాయి. ఆగస్ట్ 2020 లాంటి పరిస్థితిని నిరోధించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల్లో చైనా వంతెన కీలక భాగమని నిపుణులు భావిస్తున్నారు.