వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణలోని మూడో వంతు స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు రోజుల పర్యటన చేపడుతూ ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
పవన్ వ్యాఖ్యలతో అభిమానులు, కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన అన్ని వర్గాల వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది త్యాగాలు చేశారన్నారు. సామాజిక మార్పు కోసమే ‘జనసేన’ అని స్పష్టం చేశారు.
అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎన్ని ఓటములైనా భరిస్తామని చెప్పారు. ఆంధ్రలోనే అధికారం ఆశించలేదని… తెలంగాణలో అధికారం ఎలా ఆశిస్తానని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలని పిలుపిచ్చారు.
జనసేనకు ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల నుంచి ఆరు వేల ఓట్లు ఉన్నాయని.. తాము ఎన్నికల్లో గెలవకపోయినా, ఇతరుల గెలుపోటములను ప్రభావితం చేయగలమని భరోసా వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తలు.. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన కొంగరి సైదులు, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుటుంబాలను పవన్ శుక్రవారం పరామర్శించారు.
సైదులు కుటుంబానికి చౌటుప్పల్లో, శ్రీనివాస్ కుటుంబానికి కోదాడలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. పూర్తి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో పవన్కు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పవన్ చెప్పారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా రాజకీయాల్లో మార్పు రావాలని తెలిపారు.
ఓట్లు చీలనివ్వబోమంటే భయం ఎందుకు!
ఓట్లు చీలనివ్వబోమంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏపీలో ఎన్నికల్లో ఓట్లు చీలకుండా అన్ని ప్రయత్నాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాజధానిపై ఒప్పించినట్లే ఓట్ల చీలిక అంశంపైనా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓట్లు చీలనివ్వకూడదని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని జనసేనాని తెలిపారు. ఎవరితో పొత్తులకు వెళ్లాలో వైసీపీ తమకు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవులు మేం చెప్పిన వాళ్లకు జగన్ ఇస్తారా? అని ప్రశ్నించారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటూ ఎక్కడ పోటీ చేసినా నన్ను ఓడిస్తామన్న వైసీపీ నేతల ఛాలెంజ్ స్వీకరిస్తున్నానని ప్రకటించారు.ప్రజలకు దగ్గరయ్యే విధంగా తన యాత్ర ఉంటుందని పవన్ తెలిపారు. ఇప్పటికే అప్పు పుట్టని పరిస్థితిని రాష్ట్రానికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.