ఈసారి ఎన్నికల్లో 40 శాతం యువతకే టిక్కెట్లు ఇవ్వనున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అనంతపురం జిల్లా టిడిపి విస్తృత స్థాయి సమావేశంలోనూ, సోమందేపల్లిలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలోనూ ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఉండి పార్టీ కోసం పనిచేసే వారికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి పరిటాల రవి హత్య నిందితులను శిక్షించి ఉంటే వైఎస్ వివేకా హత్య జరిగి ఉండేది కాదని స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించాలి రాష్ట్రాన్ని కాపాడుకుంటారా.. మరో శ్రీలంక చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 151 సీట్లు ఇచ్చింది నీ కేసుల కోసమా జగన్? అని ప్రశ్నించారు. కోడి కత్తి కేసులో జగన్ తేలుకుట్టిన దొంగలా ఉన్నారని చంద్రబాబు తప్పుబట్టారు.
‘‘ఎంత గొప్పవాడవయ్యా జగన్ గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చావు. నారాసుర రక్తచరిత్ర అంటూ నేను చంపానని నా దగ్గరే కత్తి పెడతారు. దోషులను కాపాడుకోవడానికి నిరంతరం పనిచేస్తున్నారు. బాంబులు వేసి చంపుతామని సీబీఐ అధికారులనే బెదిరిస్తున్నారు. వైసీపీ బెదిరింపులను సీబీఐ గుర్తు పెట్టుకోవాలి’’ టీడీపీ అధినేత చంద్రబాబు హితవు చెప్పారు.
వైసిపి దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని ఆయన పార్టీ కార్యకర్తలకు హెచ్చరించారు. హంద్రీనీవాపై వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాలి మాటలు చెప్పి ఇప్పుడు ఏమి చేశారని ప్రశ్నించారు.
ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు తమ హయాంలో 90 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లు ఇచ్చామని గుర్తు చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఈ సబ్సిడీని నిలిపివేశారని దుయ్యబట్టారు.
జిల్లాలో వేరుశనగ పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీగానీ, ఇన్సూరెన్స్గానీ ఇచ్చే పరిస్థితిలో వైసిపి ప్రభుత్వం లేదని విమర్శించారు. పులివెందుల్లో బస్టాండ్ కట్టలేనివారు, రాష్ట్రంలో మూడు రాజధానులు కడతారా అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఢిల్లీ మెడలు వచ్చి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్మోహన్రెడ్డి ఇప్పుడు ఢిల్లీలో మెడలు వంచుతున్నారని ధ్వజమెత్తారు.
మూడేళ్ల వైసిపి పాలనలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టిడిపి ఒక్కటేనని అని స్పష్టం చేశారు. తమ హయంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో పరిశ్రమలు ముందుకొచ్చాయని వివరించారు