మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ను పోలీసులు ఎ-1 నిందితుడిగా ప్రకటించడంతో కాకినాడలో రాజకీయంగా కలకలం చెలరేగుతుంది. ముందు అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు మృతుడి కుటుంభం సభ్యులు, దళిత సంఘాలకు చెందినవారు పెద్ద పెట్టున నిరసన చేపట్టడంతో హత్యకేసుగా మార్చారు.
దీంతో ఏ క్షణమైనా ఎమ్మెల్సీని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. తన భర్త మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి ముందుగా ఎమ్మెల్సీని అరెస్టు చేయాలంటూ సుబ్రహ్మణ్యం భార్య రెండు రోజులుగా పోరాడి పోలీసులపై తీవ్రమైన వత్తిడి తెచ్చింది.
అంతకుముందు పోలీసులు రోజంతా ఎంత ఒత్తిడి తెచ్చినా ఆమె తన ‘పట్టు’ వీడలేదు. ‘నా భర్త మృతదేహం కుళ్లిపోయినా ఫరవాలేదు.. కానీ, పోస్టుమార్టానికి అంగీకరించేది లేదు’ అని ఆమె తేల్చిచెప్పారు. మార్చురీ వద్దకు బలవంతంగా తీసుకెళ్లినా శవ పంచనామాకు ఆమె అంగీకరించలేదు. ఈ దశలో ‘పోలీసులు నన్ను కొట్టారు’ అని ఆమె చేసిన విడుదల చేసిన ఆడియో సందేశం శనివారం తీవ్ర కలకలం రేపింది.
బంధువులు, దళిత సంఘాలు రోడ్డెక్కాయి. ఉద్రిక్తతలు పెరగడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద నలుగురు డీఎస్పీలు, 30మంది ఎస్ఐలు, 70మంది కానిస్టేబుళ్లు మోహరించారు. ఇంటివద్ద సరైన భద్రత లేకపోవడం, ఉదయభాస్కర్ అనుచరుల అనుమానిత కదలికలతో భయభ్రాంతులకు గురై ఇంటికి తాళం వేసి బాధితులు సామర్లకోటలో తలదాచుకున్నారు.
పోలీసులు జాడ పసిగట్టి అక్కడకు వెళ్లి వారితో బేరాలాడారు. శవ పంచనామాకు సహకరిస్తే రూ.40 లక్షలు, వైసీపీలో పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అందుకు వాళ్లు అంగీకరించకపోవడంతో పోలీసులు వెనక్కి వచ్చారు. క్రమేపీ ఒత్తిడి పెరగడంతో ఉప్పాడకు సమీపంలోని కొమరగిరిలో బంధువుల ఇంటికి సాయంత్రం బాధితులు వెళ్లారు.
అక్కడా వెంటాడిన పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా కారులో ఎక్కించుకుని మార్చురీ వద్దకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న జైభీమ్ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్కుమార్ మార్చురీ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మార్చురీ వద్ద మృతుడి భార్య, తల్లిదండ్రులను పోలీసులు కొట్టి బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని దళిత సంఘాలు తీవ్ర ఆందోళనకు దిగాయి. కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్…. శ్రవణ్కుమార్ తదితరులతో చర్చలు జరిపారు. మార్చురీలో పరిశీలించేందుకు శ్రవణ్కుమార్ ఒక్కరినే పోలీసులు లోపలకు పంపారు.
కాసేపటికి బయటకు వచ్చిన శ్రవణ్కుమార్… మృతుడి కుటుంబీకులు పోస్టుమార్టం కోసం సంతకాలు పెట్టడానికి నిరాకరించారని, పోలీసులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వెనక్కి తగ్గడం లేదని వివరించారు. వారికి మద్దతుగా నిలబడాలంటూ తిరిగి మార్చురీ ఎదుట రోడ్డుపై ఆందోళనకు దిగారు.
బాధితురాలి డిమాండ్పై అర్ధరాత్రి దాటాక రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చేవరకు వారు అక్కడే బైఠాయించారు. మృతుని భార్య, కుటుంబంతో ప్రభుత్వం తరఫున కాకినాడ ఆర్డీవో బీవీ రమణ చర్చలు జరిపారు. పోస్టుమార్టానికి సహకరించాలని కోరారు.
అలాచేస్తే మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, మృతుని సోదరుడికి అవుట్సోర్సింగ్ కొలువు, కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, 8.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికే ఎమ్మెల్సీ అరెస్టు దిశగా పోలీసులు రంగంలోకి దిగడంతో బాధిత కుటుంబం… ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించింది.
సుబ్రహ్మణ్యం తనకు రూ.20వేల బాకీ ఉన్నాడని, ఇవ్వకపోతే కాళ్లు, చేతులు విరిచేస్తానని పలుసార్లు ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ మృతుడి కుటుంబీకులను ఫోన్లో హెచ్చరించారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి సజీవంగా తీసుకువెళ్లి 12.30 సమయంలో మృత దేహంగా తీసుకువచ్చారు. అందుకు వేరే కారణాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.