ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని తెలంగాణ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అర్భన్ ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ చేసుకునే వీలు కల్పించాలని కోరింది. ఉపాది హామీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఉపాధి హామీ నిధులలో ఎలాంటి కోతలు విధించకుండా… గత ట్రాక్ రికార్డు ఆధారంగా ప్రస్తుతం జరుగుతున్న పనులను చూసి రాష్ట్రానికి కనీసం 16 కోట్ల పని దినాలను ఆమోదించాలని డిమాండ్ చేసింది.
అలాగే ప్రజోపయోగ పనులు చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాలని ఉపాధి హామీ కౌన్సిల్ తీర్మానించింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇప్పటికే బకాయి పడిన రూ 97.35 కోట్లను వెంటనే చెల్లింలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే ఎస్సి, ఎస్టిలకు ప్రత్యేకంగా పేమెంట్స్ ఇవ్వాలని కోరారు. పని జరిగే ప్రాంతాల్లో ఫోటోలు తీయడం, పంపడం వంటి ఇబ్బందికర చర్యలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు.
ఉపాధిహామీ నిధుల వినియోగంలో దేశంలో తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొంటూ అత్యధికంగా కూలీలకు పని దినాలు కల్పిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణే అని వారు తెలిపారు. రాష్ట్రంలో అడిగిన వారందరికి కొత్త జాబ్ కార్డులు ఇస్తున్నామని, కూలీలు కూడా ఉపాధి కోసం డిమాండ్ చేస్తున్నారని వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో 11 కోట్లకు మించి పనిదినాలు ఉండేవి కావని మంత్రులు తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి సంవత్సరంలోనే 10.39 కోట్ల పనిదినాలు కల్పించామని పేర్కొన్నారు. అలాగే గత సంవత్సరం (2021-..2022)లో 15 కోట్ల పనిదినాలు కల్పించామని, ఇందుకుగానూ రూ 4,395 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరపు బడ్జెట్ లో ఉపాధి హామీకి రూ. 25 వేల కోట్లు కోత పెట్టిందని విచారం వ్యక్తం చేశారు.
లేబర్ బిల్లులు కూడా రాష్ట్రానికి సంబంధం లేకుండా డైరెక్ట్ గా కూలీల అకౌంట్ లలోకి పంపించడం అన్యాయమని విమర్శించారు. గతంలో ఎస్సి, ఎస్టి కేటగిరీల వారిగా పేమెంట్ ఇచ్చేవారని, ఇప్పుడు ఆ కేటగిరీలు కూడా తొలగించం సిగ్గుచేటని విమర్శించారు.