కోనసీమకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల జిల్లాలో పెల్లుబికిన వ్యతిరేకత మంగళవారం హింసాయుత రూపం తీసుకొంది. నిరసనలు అదుపుతప్పి స్థానిక మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అమలాపురంలో ముమ్మిడివరం ఎమ్యెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి నిప్పు పెట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్ళ దాడి జరిపారు.
పలు ప్రైవేట్ కాలేజీ బస్సు లను దగ్ధం చేయగా, అల్లరిలో 20 మంది పోలీసులు గాయపడిన్నట్లు హోమ్ మంత్రి తానేటి అనిత తెలిపారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. బాష్పవాయువు ప్రయోగించారు.
పేరు పెట్టాలని ఓ వైపు.. వద్దంటూ మరోవైపు రెండు వర్గాలు సాగిస్తున్న పోటాపోటీ సమరం ఒక్కసారిగా భగ్గుమంది. ఇప్పటికే జిల్లాలో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో వారంరోజుల పాటు 144సెక్షన్ విధిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు ఆంక్షలు సైతం కాదని కదం తొక్కిన నిరసన కారులు హింసబాట పట్టారు.
జిల్లాల విభజన ప్రశాంతంగా జరిగినా.. కోనసీమ జిల్లా మాత్రం ధర్నాలు, నిరసనలతో రగిలిపోతోంది. కోనసీమ జిల్లాను కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్నారు. యువత, జేఏసీ నేతలు పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. స్పందన లేకపోవడంతో మంగళవారం అమలాపురంలో కలెక్టరేట్ ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది.
జేఏసీ నేతలు, జిల్లా సాధన సమితి నాయకులు, యువకులు భారీగా చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే 144సెక్షన్ అమల్లో ఉన్నందున ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. యువకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు- చేసుకుంది. ఇది తీవ్రతరం కావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణంగా మారింది.
యువకులు, పోలీసుల మధ్య తోపులాట తలెత్తగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కొందరు యువకులు ఓ ప్రైవేటు- బస్సుకు నిప్పు పెట్టారు. అలాగే పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్పీ సుబ్బారెడ్డి, డీఎస్పీ, గన్ మెన్లతో పాటు- పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసు వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. దీంతో అదనపు బలగాలు చేరుకుని మోహరించాయి.
ప్రజల నుంచి వచ్చిన విఙ్ఞప్తుల మేరకే జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినప్పటికీ వ్యతిరేకించడం అత్యంత బాధాకరమని హోం మంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపిస్తూ గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
దీని వెనుక టీడీపీ, జనసేన పార్టీలున్నాయన్న అనుమానం ఉందని ఆమె పేర్కొన్నారు. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్టు ఆమె చెప్పారు.
ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో ఘర్షణలు దురదృష్టకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హోం శాఖ మంత్రి తానేటి వనిత టీడీపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేందుకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.