ఇండో పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛను పరిరక్షించడానికి దృఢ చిత్తంతో వ్యవహరిస్తామని క్వాడ్ దేశాల అగ్రనేతలు ప్రతినబూనారు. జపాన్లోని టోక్యోలో జరిగిన క్వాడ్ శిఖరాగ్ర సమావేశం ముగింపు సందర్భంగా నాలుగు దేశాల అగ్ర నేతలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
బలవంతంగా యథాతథ స్థితిని మార్చడానికి ఎవరు ప్రయత్నించినా సహించబోమని కూడా ఈ ప్రకటనలో క్వాడ్ నేతలు హెచ్చరిక జారీ చేశారు. ఈ హెచ్చరికను చైనాను ఉద్దేశించినదేనని స్పష్టమవుతున్నది. అయితే సంయుక్త ప్రకటనలో ఎక్కడా చైనా పేరును ప్రస్తావించలేదు.
తూర్పు, దక్షిణ చైనా సముద్ర జలలో ఎదురవుతున్న సవాళ్లను ఈ ప్రకటన అధికంగా ప్రస్తావించింది. ఈ ప్రాంతంలోని అనేక దేశాల మధ్య సరిహద్దు వివాదాలున్నాయని పేర్కొన్నది. సౌత్ చైనా సముద్రం మొత్తం తనదేనని చైనా చెప్పుకుంటున్నది. ఈ ప్రాంతంలోని అనేక దీవులను చైనా తన సైనిక స్థావరాలుగా మార్చుకుంటున్నది. వందలాది పడవలతో కూడిన మారిటైమ్ మిలిషియాను తయారుచేస్తున్నది.
‘యథాతథ స్థితిని దెబ్బతీసేవిధంగా, వివాదాస్పద ప్రాంతాలలో సైనికీకరణ వంటి ఉద్రిక్తతలు పెంచే ఏ చర్యనైనా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం.ఏకపక్షంగా, రెచ్చగొట్టే ఏ సైనికచర్యనూ సహించబోము. ఇక్కడ కోస్ట్ గార్డ్ గస్తీ పడవలను, మారిటైమ్ మిలిషియా దళాలను ఉపయోగించడాన్ని ఎట్టి పరిస్థితులలో అనుమతించం. తమ పరిధిలోని సముద్ర సంపదను వెలికితీసుకోవడానికి ఇతర దేశాలకు అవరోధాలు కల్పిస్తే అంగీకరించబోము’ అంటూ తీవ్ర పదజాలంతో ఈ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానంగా ఉత్పన్నమైన మానవీయ పరిస్థితుల్లో తాము నిర్వహించాల్సిన బాధ్యతల గురించి కూడా ఈ నాయకులు చర్చించారు. ‘ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను కాపాడాలని ఈ ప్రకటనలో పునరుద్ఘాటించారు. ఏ దేశమైనా.. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిందే. ఐక్యరాజ్య సమితి నియమావళిని, ఆయా దేశాల ప్రాదేశిక సమగ్రతలను పరిరక్షించాల్సిందే’నని అందులో పేర్కొన్నారు.
ఆసియా సంక్షోభంపై కూడా వారు చర్చించారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని వారు ఖండించారు. మయన్మార్లో హింసకు స్వస్థి పలకాలని పిలుపు ఇచ్చారు. మహమ్మారుల కాలంలో పరస్పర సహకారం పెంచుకోవాలని, మౌలిక సదుపాయాల కల్పనలో, పర్యావరణానికి సంబంధించిన అంశాలలో చేదోడువాదోడుగా నిలవాలని కూడా ప్రతినబూనారు.