నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకుంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డాయిరు.
కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి, ఆ హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఒప్పుకొన్న తరవాత కూడా అధికారులు అతని పట్ల అత్యంత గౌరవ మర్యాదలు కనబరిచిన తీరు చూస్తే విస్మయం కలుగుతోందని ఆయన ధ్వజమెత్తారు.
సామాన్యుల పట్ల కూడా ఇంతే సహృదయత కనబరుస్తారా? అని ప్రశ్నించారు, ఈ విధమైన తీరుకి పోలీసుల కంటే వారిపై ఆధిపత్యం చలాయిస్తున్న రాజకీయ బాసులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కత్తి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదు అన్నవారే ఇప్పుడు ఆ శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కోడి కత్తి కేసు పురోగతి ఏమిటో తెలియదని, పులివెందులలో వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం గుండె పోటు నుంచి గొడ్డలి పోటు వరకు వెళ్లిందని, ఇప్పటికీ సాగుతున్న విచారణలో అసలు దోషులెవరో తేలలేదని గుర్తు చేశారు.
సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన గిరీష్ బాబు అనే ఎస్సీ యువకుడిపై అధికార పార్టీ వేధింపులకు దిగిందని, అందుకు పోలీసులను వాడుకోవడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పవన్ ఆరోపించారు. విశాఖలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి పోలీసు అధికారి కాలర్ పట్టుకొని దుర్భాషలాడినా పోలీసులు మౌనం వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భీమవరం నియోజకవర్గంలోని మత్స్యపురి గ్రామంలో విజయోత్సవాలు చేసుకొంటు-న్న జనసేన సర్పంచ్, వార్డు సభ్యుల ఇళ్లపై అధికార పార్టీ తెగబడి దాడులు చేసిందని, పలమనేరులో వైసీపీ నేత చర్యలకు మిస్బా అనే పదో తరగతి బాలిక స్కూలుకు దూరమై ఆత్మహత్య చేసుకొందని పవన్ గుర్తు చేశారు.
మట్టి తవ్వకాలు అడ్డుకొన్న గుడివాడ ఆర్ఐపై దాడి చేసినా ఏ చర్యలూ లేవని విస్మయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగుల పేరుతో జనసేన కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని.. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమేనని పవన్ పేర్కొన్నారు.
ఈ రాష్ట్రంలో దాడి చేసినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా ఏం జరగదనే ధైర్యం నేరస్తులకు కలగడానికి కారణం పాలకుల వైఖరేనని స్పష్టం చేశారు. కోడి కత్తి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో అసలు నేరస్తులను పట్టు-కొని చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించి ఉంటే, నేరం చేసేవాళ్ళకు పోలీసులపై చులకన భావన, ఏమీ కాదులే అనే ధైర్యం వచ్చి ఉండేవా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణను వైసీపీ పాలకుల నుంచి ఏమీ ఆశించలేమని, వారికే చిత్తశుద్ధి ఉంటే హత్య చేశానని ఒప్పుకొన్న ఎమ్మెల్సీపై ఈపాటికే పార్టీపరంగాను, పెద్దల సభ నుంచి పంపేలా చర్యలకు ఉపక్రమించేవారని ధ్వజమెత్తారు.
కాబట్టి పోలీసు అధికారులే బాధ్యత తీసుకొని రాజకీయ బాసుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా శాంతిభద్రతల పరిరక్షణలో స్వతంత్రంగా వ్యవహరించాలని హితవు చెప్పారు. అప్పుడే ప్రజలకు పోలీసు వ్యవస్థపై, చట్టాలపై విశ్వాసం కలుగుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.