2024 ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సంసిద్ధం చేసే దిశలో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు జరపడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావు శతజయంతి సంవత్సరం ప్రారంభం కావడం, పార్టీ ప్రారంభించి 40 ఏళ్ళు కావడంతో ఈ మహానాడుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.
పైగా, కరోనా కారణంగా, అంతకు ముందు ఎన్నికల కారణంగా గత మూడేళ్ళుగా మహానాడు పెద్ద ఎత్తున జరపలేక పోయారు. మరోవంక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ దృష్ట్యా ఈ మహానాడుకు టిడిపికి చెందిన పలువురు నేతలు నెల రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రం నలుమూలల నుండి మహానాడుకు పది వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్తున్నారు. చివరిరోజు బహిరంగ సభకు మూడు లక్షల మందిని సమీకరించాలని నిర్ణయించారు. అధికార వైసిపి నేతలు ‘గడపగడపకూ..’ కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెడతున్నారు. టిడిపితో పాటు ఆ పార్టీ నాయకులు కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దమేనని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మహానాడులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఎత్తుగడలు, వ్యూహాలపై చర్చలతో పాటు మూడేళ్ళ వైసిపి పాలనా వైఫల్యాలను ఎండగట్టడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. అమరావతి రాజధానితోపాటు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, దళితులు , మహిళలపై పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలను ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
సాగునీటి ప్రాజెక్టులు ప్రధానంగా పోలవరం, వెలుగొండ వంటి వాటి నిర్మాణం స్తంభించి పోవడం, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, పోలీసుల వేధింపులు పెరగడం, శాంతిభద్రతలు క్షీణించడం, రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరలు, మార్కెట్ వైఫల్యాలు వంటివి ప్రస్తావనకు వస్తాయని చెబుతున్నారు.
ఎన్నికల్లో రాజకీయ పొత్తులపై ఇప్పటికే చర్చ సాగుతోంది. జనసేనతో పొత్తు ఉంటుందనే చర్చ రెండు పార్టీల్లోనూ ఉంది. ఈ దిశగా చర్చలు సాగుతున్న తరుణంలో మహానాడులో దీనిపై ఓ స్పష్టతకు వచ్చే అవకాశాలున్నాయా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మరోవంక బిజెపితో అనుసరించే వైఖరిపై సహితం స్పష్టతకు ఆ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు.