రాయపూర్-విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్కు సంబంధించి భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ ఎకనమిక్ కారిడార్ ఏర్పాటుతో చత్తీస్గఢ్, ఒడిశా, ఎపికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
మే నెల ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీటితోపాటు కాకినాడ- శ్రీకాకుళం సహజ వాయువు పైపులైను ప్రాజెక్టుల ప్రగతి, నేషనల్ బ్రాండ్ బ్యాండ్ మిషన్ గురించి సిఎస్లతో ప్రధాన మంత్రి సమీక్షించారు.
అల్యూమినియం, బొగ్గు, బాక్సైట్ వంటి విలువైన ఖనిజాలు విశాఖపట్నం ఓడరేవు ద్వారా ఎగుమతి, దిగుమతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని మోదీ పేర్కొన్నారు. కాకినాడ -శ్రీకాకుళం సహజవాయువు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 5జి సేవలకు ఇది ఎంతగానో ప్రోత్సాహకంగా ఉంటుందని తెలిపారు. ఫైబర్ టవర్ ఇన్స్లేషన్లకు సంబంధించిన అనుమతులు వేగవంతం చేయడంతోపాటు ఆ సేవలను కేంద్రీకరిస్తుందని చెప్పారు. గతిశక్తి సంచార్ పోర్టల్ కేంద్రీకృత రైట్ ఆఫ్ వే అనుమతుల్ని సులభతరం చేస్తుందని వివరించారు.
టెలికాం, పరిశ్రమల మౌలిక వసతుల కల్పన కోసం ఆర్ఒడబ్ల్యు అనుమతులు పొందేందుకు 5జి సేవల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ పోర్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలను అనుసంధానించేలా ఏకీకృత, సమీకృత విధానాన్ని అందిస్తుందని సిఎస్కు వివరిస్తూ దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు.
సిఎస్ సమీర్శర్మ మాట్లాడుతూ రాయపూర్-విశాఖ ఎకనమిక్ కారిడార్కు సంబంధించి 798 హెక్టార్లు భూసేకరణకు గాను 561 హెక్లార్ల భూమిని ఇప్పటికే అప్పగించినట్లు తెలిపారు. రోడ్డు సైడ్ ఎమ్మిటీస్కు సంబంధించి మరో 50 ఎకరాలను కూడా అప్పగించినట్లు ప్రధానికి సిఎస్ వివరించారు. మిగిలిన భూసేకరణకు గానూ అడ్వాన్స్ పొజీషన్ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వివరించారు.
కాకినాడ- శ్రీకాకుళం సహజ వాయువు పైపులైన్ ప్రాజెక్టుకు సంబంధించి శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు మొదటి దశ పూర్తయ్యిందని, విశాఖ నుంచి కాకినాడ వరకు రెండో దశ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.