గత ఏడాది నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన ప్రసిద్ధ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) తన ఛార్జ్ షీట్ సమర్పించింది. ఏజెన్సీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, ఎన్సిబి 14 మంది వ్యక్తులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
అయితే, ఇందులో ఆర్యన్ని చేర్చలేదు. “ఆర్యన్ (ఖాన్), మోహక్ (జైస్వాల్) మినహా నిందితులందరూ మాదకద్రవ్యాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు” అని నోట్ పేర్కొంది. ‘సిట్’ తన దర్యాప్తును “ఆబ్జెక్టివ్ పద్ధతిలో” నిర్వహించిందని తెలిపింది.
షారూఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ ఇద్దరికి ఉపశమనం లభించిందంటూ న్యాయవాది ముఖుల్ రోహత్గి పేర్కొన్నారు. ”ఆర్యన్, అతడి తండ్రి షారుక్కు గొప్ప ఉపశమనం లభించినట్లయింది. నిజం ఇప్పటికైనా బయటపడింది. ఆర్యన్ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభించలేదు. అతడిపై కేసు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాల్లేవ్. ఇకనైనా ఎన్సిబి తన తప్పు తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది” అని రోహత్గీ వ్యాఖ్యానించారు.
డ్రగ్స్ కేసులో ఎన్సిబి అరెస్టు చేసిన మోహక్ జైస్వాల్కు గత నవంబర్లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైస్వాల్ పూర్తిగా నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఆరోపించిన నేరంలో కేంద్ర ఏజెన్సీ అతనికి ఎటువంటి “ప్రత్యక్ష పాత్ర” ఆపాదించలేదని బెయిల్ పిటిషన్లో పేర్కొంది.
ఈ కేసులో 20 మందిని అరెస్టు చేశారు, అందులో 12 మందికి ప్రత్యేక ఎన్ డిపిఎస్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా, బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్తో సహా మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది.
ఎన్సిబి చీఫ్ సమీర్ వాంఖడే నేతృత్వంలో ముంబయి తీరంలోని ఓ క్రూయిజ్ నౌకపై అధికారులు గతేడాది అక్టోబర్ లో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ సహా 19 మందిని అక్టోబరు 3న ఎన్సిబి అధికారులు అరెస్టు చేశారు.
అతడికి ముంబయి ప్రత్యేక న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ మరుసటి రోజు ఆర్యన్ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆర్యన్ దరఖాస్తు చేసుకోగా.. ప్రత్యేక న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. ఆర్యన్ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ఆర్యన్కు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబరు 29న తీర్పు బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్.. అక్టోబరు 30న బెయిల్పై విడుదలయ్యాడు.