హెచ్చు టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ)తో ప్రమాదమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. దీని ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం సూచీపై ఒత్తిడి పడొచ్చని పేర్కొంది. అధిక ధరల వల్ల పారిశ్రామిక ముడి సరుకులు, రవాణ, అంతర్జాతీయ సరఫరా వ్యయాలు కూడా పెరిగిపోతున్నాయని ఆర్బిఐ శుక్రవారం విడుదల చేసిన తన 2021-22 వార్షిక రిపోర్ట్లో పేర్కొంది.
”గడిచిన ఏడాదిలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. పలు అడ్డంకులు నెలకొనప్పటికీ రికవరీ దారిలోనే ఉంది. భవిష్యత్తు వృద్థి సరఫరా చెయిన్పై అధారపడి ఉంది. లక్ష్యానికి అనుగుణంగా ద్రవ్యోల్బణను నియంత్రించడం ద్వారా వృద్థికి మద్దతునివ్వాలని ఆర్బిఐ నిర్దేశించుకుంది” అని తెలిపింది.
“డిమాండ్ పుంజుకోవడానికి ముఖ్యంగా మూలధన వ్యయాలను పెంచాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ భౌగోళిక ప్రతికూలాంశాలు వినియోగదారుల ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగిసిపడేలా చేస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు, లోహాలు, ఎరువుల ధరలు వాణిజ్య, కరెంట్ లోటును మరింత పెంచుతున్నాయి.” అని ఈ రిపోర్ట్ పేర్కొంది.
2022 మార్చి 31తో ముగిసిన ఏడాదిలో ఆర్బిఐ బ్యాలెన్స్ షీట్ 8.46 శాతం పెరిగింది. ఇదే సమయంలో సెంట్రల్ బ్యాంక్ ఆదాయం 20.14 శాతం పెరగ్గా.. వ్యయాలు 280 శాతం ఎగిసినట్లు రిపోర్ట్ వెల్లడించింది.