భూసేకరణ జీవో 80ఏ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ జిల్లా అరెపల్లిలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన తీన్మార్ మల్లన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు రైతులను నెట్టేసి, తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి వేలేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం స్వంత పూచికత్తుపై వదిలిపెట్టారు.
జీఓ 80ను వ్యతిరేకంగా ఆరెపల్లిలో రైతులు పోచమ్మ ఆలయం వద్ద గ్రామ సభ నిర్వహించగా వారికి మద్దతుగా వెళ్ళితే అరెస్టు చేయడంతో పాటు అక్రమ కేసు నమోదు చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని, ల్యాండ్ పూలింగ్కు సంబంధించిన జీవో 80ఏ ను రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు.
గ్రామంలో ప్రశాంతంగా గ్రామ సభ పెట్టుకుంటే పోలీసులు వచ్చి సభను భగ్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతమందిని అరెస్ట్ చేసిన ఉద్యమం ఆగదని, భూసేకరణ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులకు అండగా ఉంటామని తీన్మార్ మల్లన్న తెలిపారు. 80ఏ జీవోను రద్దు చేసేంత వరకు రైతులంతా ఐకమత్యంతో పోరాడాలని సూచించారు.
కొద్దికాలం క్రితం బీజేపీలో చేరిన మల్లన్న ఇటీవల ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తానే సొంత పార్టీ పెడతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా కథనాలు చెప్పేవారు. గత ఏడాది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు.
తర్వాత క్యూ న్యూస్ చానెల్ పేరుతో జనాలకు దగ్గర అయ్యాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉదయమే వార్తలు చదివేవాడు. దీంతో ప్రభుత్వం కూడా అతనిపై ఓ కన్నేసి ఉంచింది. సమయం దొరికితే చాలు.. అతనిపై చర్యలకు ఉపక్రమించేది. రకరకాల కేసులను నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు.