చైనాను అధిగమించి అమెరికా 2021-22 లో భారత్ అగ్ర వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. దీంతో రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని నిపుణులు తెలిపారు.
భారత్ విశ్వసనీయ వాణిజ్య భాగస్వామిగా ఎదుగుతోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ ఖాన్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు తమ వాణిజ్య అవసరాల కోసం చైనాపై మాత్రమే ఆధారపడకుండా, భారత్ వంటి ఇతర దేశాలతో వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నాయని తెలిపారు.
వాణిజ్య శాఖ అందించిన నివేదిక ప్రకారం 2021-22లో అమెరికా, భారత్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 119.42 బిలియన్ డాలర్లు జరిగినట్లు తెలిపింది. ఇది 2020-21లో 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికాకి ఎగుమతులు 2020-21లో 51.62 బిలియన్ డాలర్లగా ఉండగా, ఈ ఏడాది 76.11 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
అలాగే అమెరికా నుండి భారత్కు దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 29 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది 43.31 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు వాణిజ్య శాఖ తెలిపింది. 2021-22లో భారత్ -అమెరికాతో 32.8 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును కలిగి ఉందని వెల్లడించింది.
2021-22లో చైనాతో భారత్ రెండు మార్గాల వాణిజ్యం గతేడాది 86.4 బిలియన్ డాలర్లు కాగా 2021-22లో 115.42 డాలర్లగా ఉంది. చైనాకు ఎగుమతులు 2020-21లో 21.18 బిలియన్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 21.25 బిలియన్ డాలర్లకు స్వల్పంగా పెరిగాయి.
అదే విధంగా చైనా నుండి దిగుమతులు 2020-21లో 65.21 బిలియన్ డాలర్లు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 94.16 బిలియన్ డాలర్లకు పెరిగాయి. వాణిజ్య అంతరం 44 బిలియన్ డాలర్ల నుండి 72.91 బిలియన్ డాలర్లకు పెరిగింది.