కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల పనులపై అభ్యంతరాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖల మీద లేఖలు రాస్తోంది. మంగళవారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్కు మరో లేఖ రాశారు.
అత్యున్నత మండలి (అపెక్స్ కైన్సిల్), కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల విస్తరణ పనులు చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరారు. ఏపిలో చేపట్టిన పంప్డ్ హైడ్రోస్టోరేజ్ జలవిద్యుత్ ఉత్పత్పత్తికి సంబంధించిన పథకాలపై లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఎలాంటి అనుమతుల్లేకుండా కృష్ణానదిపై చేపట్టిన పనులను బోర్డు దృష్టికి తీసుకు పోయారు. ఏ విధమైన అనుమతులు లేకుండా పలు పథకాల పనులు చేపట్టిందని తెలియజేస్తూ ఆ పనుల పట్ల అభ్యంతరాలు తెలిపారు. ఆ పనులను నిలువరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అన్ని పంప్డ్ స్టోరేజి పథకాల వివరాలు తెప్పించి ఇవ్వాలని లేఖ ద్వారా బోర్డుకు విజ్ణప్తి చేశారు. ఏపిలోని కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద చేపట్టిన గ్రీన్కో విద్యుత్ ప్రాజెక్టుపైన కూడా అభ్యంతరం చెబుతూ బోర్డుకు ఫిర్యాదు చేస్తూ ఈఎన్సీ బోర్డుకు మరో లేఖ రాశారు.
అనుమతుల్లేకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏ ఏ ప్రాజెక్టు కోసం కృష్ణా జలాలును వినియోగించరాదని సూచించారు. ఈ అంశంలో తగిన చర్యలు తీసుకోవాలని గతంలో కూడా లేఖ రాసినట్టు గుర్తు చేశారు.
నీటి లభ్యత తక్కువగా ఉన్న కృష్ణా నది బేసిన్ నుంచి నీటిని ఇతర బేసిన్లకు తరలించడం, జల విద్యుత్ ఉప్పత్తి కోసం ఉపయోగించడం తీవ్రమైన అభ్యంతరకరమని ఆక్షేపించారు. అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతుల్లేని అన్ని ప్రాజెక్టులు, కాల్వలు, విస్తరణ పనులు వెంటనే నిలిపివేయించాలని కోరుతూ ఈఎన్సీ మురళీధర్ కృష్ణానదీయాజమాన్యబోర్డు చైర్మన్కు లేఖ రాశారు.