ఉక్రెయిన్పై యుద్ధం తరువాత రష్యా అధ్యక్షుడు పుతిన్ క్రమముగా ప్రభుత్వంపై పట్టు కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన వ్యవహారం పట్ల ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. త్వరలో సైనిక తిరుగుబాటు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పరిశీలకులు భావిస్తున్నారు.
పుతిన్ కు అత్యంత సన్నిహితులు, ఆయన ఎదుగుదలలో తెరవెనుక ఘనమైన పాత్ర పోషించిన వారు ఒక్కొక్కరూ దూరమవుతున్నారు. ఒకవైపు తీవ్ర ఆరోగ్య సమస్యలు, మరోవైపు ఉక్రెయిన్లో ఎదురుదెబ్బలు పుతిన్పై అసంతృప్తికి కారణమని భావిస్తున్నారు. తాజాగా పుతిన్ సలహాదారు, మాజీ అధ్యక్షుడు ఎల్సిన్ అల్లుడు వాలెంటిన్ యుమాష్ బోరిస్ పదవినుంచి తప్పుకున్నారు.
ఎల్సిన్ హయాంనుంచి ఇప్పటివరకు క్రెవ్లిున్ వ్యవహారాలలో అత్యంత కీలక పరిణామాలకు బాధ్యుడు అయిన యుమాష్ ఇటీవలి పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ పదవి నుండి వైదొలగినట్లు తెలుస్తోంది. ఎల్సిన్ హయాంలో పనిచేసి ఇప్పుటివరకు బాధ్యతలు నిర్వహించిన చివరి వ్యక్తి యుమాష.
నిజానికి ఉక్రెయిన్పై యుద్ధంపట్ల అటు సైన్యంలోను, పుతిన్ సన్నిహితుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఈ యుద్ధంలో దాదాపు 33వేలమంది సైనికులను, కమాండర్లు, కీలక వ్యక్తులను రష్యా కోల్పోయింది. పుతిన్కు సన్నిహితులైన సంపన్నులు (ఓలిగర్లు) తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది సలహాదార్లు తప్పుకున్నారు. ఇప్పుడు యుమాష్ వంతు వచ్చింది.
ఒక సాధారణ మధ్యస్థాయి ఉద్యోగి స్థాయి నుండి పుతిన్ క్రెమ్లిన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పుతిన్కు పదోన్నతి లభించడం వెనుక యుమాష మద్దతు ఉండటం గమనార్హం. అధ్యక్ష పదవినుంచి తాను తప్పుకుంటే ఎవరిని సూచించొచ్చు, పుతిన్ పనికొస్తాడా? అని యుమాషాను ఎల్సిన్ అడిగినప్పుడు యుమాషా సానుకూలంగా స్పందించారు.
అంతేకాదు, అతడు అద్భుతమైన అభ్యర్థి అని, ఆయన పేరును ప్రకటించవచ్చని తెలిపాడు. దీంతో వారసుడిగా పుతిన్ పేరును ఎల్సిన్ ప్రతిపాదించడంతో 2000 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ తిరుగులేని విజయం సాధించారు. ఆ తరువాత కూడా ఎల్సిన్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించిన పుతిన్ యుమాషాను తనకు కూడా సలహాదారుగా కొనసాగించారు.
2020 జనవరిలో ఎల్సిన్ కుమార్తె, యుమాషో సతీమణి తాత్యానా పుట్టినరోజు సందర్భంగా వారింటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పడం విశేషం. ఎల్సిన్ విధానాలను కాదని అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ యుమాషా వంటివారు వ్యతిరేకించలేదు. అయితే ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఎల్సిన్ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోయారు.
ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైన వెంటనే యుమాష కుమార్తె తన ఇన్ష్టాగ్రామ్లో ఉక్రెయిన్ జాతీయ పతాకాన్ని పోస్ట్ చేసి `నో టు వార్’ అనే వ్యాఖ్యను, పగిలిన గుండె ఎమోజీని జోడించారు. కాగా ఇప్పుడు యుమాష తప్పుకున్నారు. దీనిపై క్రెవ్లిున్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్కాని ,యుమాష సన్నిహితులు కానీ స్పందించలేదు.
అయితే ఆయన ఏప్రిల్లోనే ఆ పదవినుంచి తప్పుకున్నారని ఎల్సిన్ ప్రెసిడెన్షియల్ సెంటర్ ఫౌండేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ల్యూడ్మిల తెలెన్ స్పష్టం చేశారు. అయితే ఎందువల్ల రాజీనామా చేశారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.
ఇటీవలి కాలంలో పుతిన్కు దూరమైన వారిలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఎల్సిన్ హయాంలో చక్రం తిప్పి, పుతిన్ హయాంలోనూ కొనసాగిన సీనియర్ దత్యవేత్త అనతోలి చుబాయిస్ మార్చిలో తన బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో రష్యా దౌత్యవేత్తగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మరో దౌత్యవేత్త కూడా అదే బాటలో వెళ్లారు.
గత కొన్నేళ్లుగ పుతిన్కు అభద్రత, భయం, అధికారం కోల్పోతామన్న ఆందోళన ఎక్కువయ్యాయని, మానసిక, శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నారని నాటో మాజీ చీఫ్ అభిప్రాయపడ్డారు. ఆయన నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటూ, ఏకపక్ష వైఖరితో క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
కాగా పుతిన్ విచిత్రమైన మనస్తత్వంతో ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నారని, రష్యా సమాజంలో తీవ్ర అసంతృప్తి నెలకొందని సీఐఏ డైరక్టర్ విలియమ్ బర్నస్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్పై యుద్ధంలో విజయం కోసం తహతహలాడుతున్న పుతిన్ సైన్యంలో భారీ నష్టాన్ని పట్టించుకోవడం లేదని, ఇప్పటికే భారీ మూల్యం చెల్లించామని దేశ ప్రజలు, సైన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పుతిన్ అధికారానికి రోజులుదగ్గరపడ్డాయన్న ప్రచారం జరుగుతోంది.