కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడులు, ముఖ్యంగా లక్షిత హత్యలు కొనసాగుతూ ఉండడం, కాశ్మీరీ పండిట్లు, ఇతర హిందువులను ఎంపిక చేసి కాల్చిపారవేస్తూ ఉండడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నది.
బ్యాంక్ మేనేజర్ హత్యను మర్చిపోకముందే.. ఉగ్రవాదులు మరో అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాశ్మీర్లోని బుద్గాంలో గురువారం రాత్రి ఇద్దరు వలస కూలీలపై కాల్పులు జరిపారు. ఓ వలస కూలీ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.
క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్ కాశ్మీర్ జిల్లాలోని చదూరా ప్రాంతంలోని మాగ్రేపోరా వద్ద ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఇద్దరు వలస కూలీలపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని బీహార్కు చెందిన దిల్ఖుష్ కుమార్గా గుర్తించారు.
ఇటీవల జమ్ముకాశ్మీర్లో పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడుతున్నారు. గురువారం రాజస్తాన్కు చెందిన బ్యాంక్ మేనేజర్ విజరు కుమార్ను పొట్టనబెట్టుకున్నారు.అంతకు రెండు రోజుల ముందు లక్షిత దాడులకు ఒక దళిత ఉపాధ్యాయిని బలైంది. జమ్మూకి చెందిన రజిని బాల అనే హిందూ టీచర్ను తీవ్రవాదులు స్కూల్ బైట కాల్చివేశారు.
కుల్గామ్లో జరిగిన బ్యాంకు మేనేజర్ విజయ్కుమార్ను కాల్చి చంపింది తామేనని కాశ్మీరీ ఫ్రీడమ్ ఫైటర్స్ గ్రూపు ప్రకటించింది. దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన బ్యాంకు మేనేజర్ హత్యకు బాధ్యత వహిస్తూ లేఖను విడుదల చేసింది. కాశ్మీర్ భౌతిక స్వరూపం మార్చాలని ప్రయత్నించిన వారందరికీ ఇదే గతి పడుతుందని గ్రూపు హెచ్చరించింది.
ప్రధాని మోదీ ప్రభుత్వంలో కాశ్మీర్లో వచ్చి స్థిరపడాలని ప్రయత్నిస్తే, ప్రాణం ఖరీదు చెల్లించాలనే వాస్తవం తెలుసుకోవాలని కాశ్మీరీ ఫ్రీడమ్ ఫైటర్స్ లేఖలో హెచ్చరించారు. కాశ్మీర్లో జరుగుతున్న హత్యలు చూసిన తర్వాత అయినా, ఆలోచించాలని, లేనిపక్షంలో తర్వాత టార్గెట్ మీరేనని హెచ్చరించింది.
బ్యాంకుమేనేజర్ విజయ్కుమార్ను కాశ్మీర్లో ఉగ్రవాదులు కాల్చి చంపిన కొద్ది గంటల్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయభద్రతా సలహాదారుడు అజిత్దోవల్తో న్యూఢిల్లి లో సమావేశమయ్యారు. కాశ్మీరీల హత్యల నేపథ్యంలో ఈ ఇద్దరి భేటికి ప్రాముఖ్యత సంతరించుకుంది.
జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతలు, భద్రతా చర్యలపై శుక్రవారం హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం జరుగనున్నది. గత పదిహేను రోజుల్లో ఈ మీటింగ్ జరగడం ఇది రెండోసారి. ఈ సమావేశంలో, జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్సిన్హా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్దోవల్, ఆర్మీచీఫ్, పలు విభాగాలకు చెందిన డైరెక్టర్ జనరల్స్, ఇతర అధికారులు పాల్గొననున్నారు.