కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తర్వాత ఆమె తనయ ప్రియాంక గాంధీకి కూడా శుక్రవారం కరోనా సోకింది. తనకు తేలికపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని ప్రియాంక గాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం తాను హోం క్వారంటైన్లో ఉన్నానని ప్రియాంక పేర్కొన్నారు.
తనను కలిసిన వారు, పరిచయం ఉన్నవారు కూడా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రియాంక గాంధీ సూచించారు. బుధవారం సాయంత్రం సోనియాగాంధీకి స్వల్ప జ్వరం వచ్చిందని, కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో గురువారం ఉదయం ఆమెకు కరోనా పరీక్ష చేశారు. ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా వెల్లడించారు.
ప్రస్తుతం సోనియా ఐసొలేషన్లో ఉన్నారని, ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందుతోందని తెలిపారు. గత వారం రోజులుగా సోనియా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారని, వారిలో కూడా కొందరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించామని సుర్జేవాలా ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోనియా బాగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని ఆయన చెప్పారు.
ఇలా ఉండగా, కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24గంటల్లో కొత్తగా 4,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి నుంచి మరో 2,363 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21,177 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 193.83 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు 85.17 కోట్లు దాటాయి.