కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును స్వాగతిస్తున్నామని స్పష్టం చేస్తూ కోనసీమ వివాదంలో రాజకీయ కుట్ర ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసును పక్కదారి పట్టించేందుకే అమలాపురం ఘటన సృష్టించారని విమర్శించారు.
అంబేద్కర్ పేరును రాజకీయం చేశారని తప్పుబట్టారు. కోనసీమ ఘటనపై సీఎం జగన్, డీజీపీ స్పందించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఒకే పార్టీలో రెండు వర్గాల గొడవను కుల ఘర్షణగా మార్చారని మంది పడుతూ కోనసీమ తగులబడుతుంటే మంత్రులు బస్సు యాత్ర చేస్తారా అని ప్రశ్నించారు.
ఘటనపై డీజీపీ స్పందించకుంటే కేంద్రమంత్రి అమిత్షాకు లేఖ రాస్తానని స్పష్టం చేశారు.
ఈ విషయమై డిజిపిని కలిసేందుకు పదేపదే కోరుతున్నా అపాయింట్మెంటు ఇవ్వడం లేదని చెబుతూ శనివారం ఉదయంలోపు ఇవ్వకపోతే కేంద్ర హోమ్శాఖ మంత్రి అమిత్షాకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ఏపీలో ఘర్షణలు సృష్టించాలనే కుట్ర జరుగుతోందని పేర్కొంటూ సమస్యలను పక్కదారిపట్టించడమే వైసీపీ సర్కార్ విధానం అని, మండిపడ్డారు. ఏపీలో మళ్లీ వైసీపీ సర్కార్ వస్తే అరాచకమేనని.. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని హెచ్చరించారు.
వై ఎస్ ఆర్ ప్రభుత్వంలో `వై’ అంటే యువజనులకు ఉపాధి లేదని, `ఎస్’ అంటూ శ్రామికులకు ఉన్నపని తీసేశారని, `ఆర్’ అంటే రైతులకు మద్దతుధర లేదని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.
ఇక వై ఎస్ ఆర్ పేరు ఆ పార్టీకి ఎందుకో వారే చెప్పాలని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం పోలవరం కాదని పేర్కొంటూ, కేంద్రం సొమ్మును ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.