పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో శుక్రవారం హత్యకు గురైన టిడిపి కార్యకర్త కంచర్ల జల్లయ్య మృతదేహానికి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే పోలీసులు హడావిడిగా శనివారం ఉదయం శవపరీక్ష జరపడంతో వివాదం తలెత్తింది. అంత్యక్రియలకు బయలుదేరిన పలువురు టిడిపి నాయకులను పొరుగు జిల్లాల్లోనే ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.
పోలీసుల తీరును నిరసిస్తూ జల్లయ్య కుటుంబ సభ్యులు, బంధువులు నరసరావు పేట ఆస్పత్రి మార్చురీ ఎదుట ధర్నా చేశారు. తమ పార్టీ నేతలు వచ్చే వరకు పోస్టుమార్టం చేయొద్దంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, మృతుని కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వావాదం, తోపులాట చోటు చేసుకుంది.
బంధువులను నెట్టివేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వైద్యశాల నుండి అంబులెన్స్లో బల్లాపల్లి మండలం రావులాపురం గ్రామానికి పోలీసులు తరలించారు. స్వగ్రామం జంగమేశ్వరపాడుకి కాకుండా బంధువులు ఉన్న రావులాపురం గ్రామానికి తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏరియా ఆస్పత్రి వద్దకు వచ్చిన టిడిపి నరసరావుపేట ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
రావులపురం గ్రామంలోకి టిడిపి రాష్ట్ర, జిల్లాల నేతలను అనుమతించే వరకు మృతదేహాన్ని తీసుకోబోమని మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. ఉదయం 11 గంటలకు రావులాపురం గ్రామానికి చేరుకున్న మృతదేహం సాయంత్రం నాలుగు గంటల వరకు వరకు అంబులెన్స్లోనే ఉండిపోయింది.
టిడిపి నేతలను రావులాపురానికి అనుమతించే వరకు అంత్యక్రియలను నిర్వహించేది లేదంటూ మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు రాస్తారోకో చేశారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, మాచర్ల ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి మాత్రమే రావులాపురానికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.
టిడిపి నేతలందరినీ అనుమతించాలని మాజీ మంత్రి పుల్లారావు కోరారు. పలు తర్జనభర్జనల మధ్య టిడిపి నేతలు జల్లయ్య కుటుంబ సభ్యులతో వీడియో ద్వారా మాట్లాడారు. అంత్యక్రియలు చేసుకోవాలని జల్లయ్య కుటుంబ సభ్యులకు కోరారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఎట్టకేలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వీకరించారు.
టిడిపి కార్యకర్త కంచర్ల జల్లయ్య అంత్యక్రియలకు హాజరు కావడానికి వెళ్తున్న గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన పలువురు టిడిపి నాయకులను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. టిడిపి రాష్ట్ర కమిటీ నుంచి హాజరు అవుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను దాచేపల్లి మండలం పొండుగుల చెక్ పోస్ట్ వద్ద, ఎంఎల్సి బీద రవిచంద్రను ప్రకాశం జిల్లా సంతమాగులూరు అడ్డురోడ్డు వద్ద అరెస్టు చేశారు.
ఎంఎల్సి బుద్దా వెంకన్నను విజయవాడలో గృహనిర్బంధంలో ఉంచారు. కొల్లు రవీంద్రతో పాటు మరో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులును అరెస్ట్ చేసి దాచేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. కొల్లు రవీంద్ర, జి.వి.ఆంజనేయులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. బీద రవిచంద్రను వినుకొండ పోలీస్ స్టేషన్లో ఉంచారు.
మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావును దైద గ్రామం వద్ద, కొమ్మాలపాటి శ్రీధర్ను పెదకూరపాడులో అరెస్టు చేశారు. మాచర్ల టిడిపి ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని, టిడిపి గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణను గృహనిర్బంధంలో ఉంచారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును హౌస్ అరెస్టు చేశారు.
కాగా, టిడిపి కార్యకర్త జల్లయ్య హత్య వెనుక వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పల్నాడును వల్లకాడు చేస్తున్నారని విమర్శించారు. మూడేళ్లలో ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఐదుగురిని హత్య చేశారని, వందల మందిపై దాడులు చేశారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రోద్బలంతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. వీటిపై స్పెషల్ కోర్టు పెట్టి విచారణ చేసి దోషులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. జల్లయ్య అంత్యక్రియలకు వెళ్తున్న నేతలను అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా పోలీసులే జల్లయ్య మృతదేహాన్ని బలవంతంగా రావులాపురం తరలించారని డిజిపికి చంద్రబాబు లేఖ రాశారు. జల్లయ్య కుటుంబ సభ్యులను టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు.