హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో నిందితుల దురాగతాలు ఒకటొక్కటి బైటకు వస్తున్నాయి. పోలీసులు కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం ఈ ఘటనలోని నిందితులు బాధితురాలితో పాటు మరోక అమ్మాయినికూడా వేధించినట్లు తేలింది.
ఈ వ్యవహరానికి కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రధారిగా నిర్ధారించారు పోలీసులు. అంతేకాదు సాదుద్దీన్ మాలిక్తో కలిసి పబ్లో అరాచకాలకు పాల్పడినట్లు తేలింది. సాదుద్దీన్ మాలిక్ కార్పొరేటర్ కొడుకు కలిసి ఇద్దరు మైనర్లను వేధించారు. ఆ వేధింపులు భరించలేకనే వారిద్దరూ మధ్యలో పబ్ నుంచి బయటకు వచ్చారు.
అయితే ఆ ఇద్దరిలో ఒకరు బయటకు వచ్చి నేరుగా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయారు. మిగిలిన మైనర్పైనే దుండగులు దాష్టికానికి సాదుద్దీన్ గ్యాంగ్ దిగింది. పబ్ ముందే నిలబడ్డ బాధిత మైనర్ను మాటల్లో పెట్టి, ట్రాప్ చేశాడు కార్పొరేటర్ కొడుకు. ఆపై ఇంటి వద్ద దించుతామని నమ్మబలికాడు.
మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్ఖాన్కు చెందిన బెంజ్ కారులో ఆ అమ్మాయితో నలుగురు ప్రయాణించారు. పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరి వరకు వెళ్లారు. ఆ కారులోనే అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించబోయారు. అది భరించలేక కాన్సూ బేకరి వద్ద నుంచి వెళ్లిపోతానని వాళ్లతో చెప్పింది. దీంతో మళ్లీ బెంజ్ కారులో ఎక్కించుకొని కొద్దిదూరం ముందుకు వెళ్లారు.
ఫోన్ కాల్ రావడంతో కారులో ఉన్న ఎమ్మెల్యే కుమారుడు మధ్యలోనే దిగిపోయాడు. ఆపై బెంజ్ కారులో పెట్రోల్ అయ్యిపోయిందంటూ డ్రామాలాడింది ఆ గ్యాంగ్. వెనకాలే ఇన్నోవాలో వక్ఫ్బోర్డు చైర్మన్ కొడుకు వాళ్లను ఫాలో అవుతూ వచ్చాడు. బాధితురాలని ఇన్నోవాలోకి మార్చి, బంజారాహిల్స్లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఘటన తర్వాత తిరిగి బేకరికి చేరుకున్న నిందితులు ఎంజాయ్ చేశామంటూ గ్రూప్ ఫోటో దిగి ఇన్స్టాలో పోస్టు చేశారు. అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు నమోదు కాగానే నిందితులు హైదరాబాద్ నుంచి పారిపోయారు. ఆపై ఇన్నోవా కారును వక్ఫ్బోర్డు చైర్మన్ ఫాంహౌస్లో దాచారు.
గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో బెంజ్ కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పు కూడా క్లూస్ టీమ్ సేకరించింది. ఇన్నోవా కారులోనూ బాలిక వెంట్రుకలు దొరకగా వాటితో పాటు.. నిందితుల వీర్య నమూనాలను కూడా ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. వీర్య నమూనాలు, బాలిక వెంట్రుకలు ఎఫ్ఎస్ఎల్కు పంపించారు.
ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించిన పోలీసులు మరో నిందితుడు ఉమర్ఖాన్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కోర్టు ఎదుట హాజరుపరిచిన అనంతరం రిమాండ్కు తరలించనున్నారు.
మరోవైపు ఈ కేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ను నియమించారు. ఈ కేసులో కీలకంగా మారిన ఇన్నోవా, బెంజ్ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకోగా, రెండు కార్లను క్లూస్ టీమ్తో పాటు, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. కేసు నమోదు చేసిన మరుసటి రోజు బెంజ్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారు గురించి రెండు మూడు రోజులు పట్టించుకోలేదు.