ఆడబిడ్డలపై అత్యాచారాలను నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా అటువంటి ఆలోచనలే మృగాళ్లకు రాకుండా సంస్కరణలు తీసుకురావలసిన బాధ్యత చట్టసభ సభ్యులు, మేధావులు, సంఘ సంస్కర్తలపై ఎంతగానో ఉందని కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న అమానుష సంఘటనలు మరోసారి హెచ్చరిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో తరచూ అత్యాచార ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల శంషాబాద్ పరిసరాల్లో జరిగిన ‘దిశ’ హత్యాచార ఘటన మరువక ముందే, ఈ వారంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన పదిహేడేళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం తీవ్రంగా మనసును కలచివేసిందని పేర్కొన్నారు.
కొందరు మైనర్ బాలురు వారు ప్రయాణిస్తున్న కారులోనే అత్యాచారానికి పాల్పడటం మాటలకందని దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకునే బిడ్డలపై పరులెవ్వరైనా ఒక దెబ్బ వేస్తేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారని, ఆవేదనకు గురవుతారని, అటువంటిది ఒక సమూహమే ఆ బాలికను చెరపడితే ఆ బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయివుంటారో, ఎంత క్షోభకు గురై ఉంటారో ఊహించగలనని తెలిపారు.
అటువంటి దారుణ పరిస్థితి పగవారికి సైతం రాకూడదని కోరుకునే భారతీయ సమాజం మనదని పవన్ చెప్పారు. అటువంటి సమాజం నుంచి వచ్చిన మన బిడ్డలు రాక్షసులుగా మారి ఇటువంటి నీచాలకు పాల్పడడం ఉపేక్షించడానికి వీలు లేని ఘోరమని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో పోలీసుల పరిశోధన చురుగ్గా సాగుతున్నప్పటికీ దోషులలో ఏ ఒక్కరు తప్పించుకోకుండా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముద్దాయిలు చిన్నవారైనా, పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా పట్టి చట్టం ముందు నిలబెట్టాలన్నారు. దోషులకు శిక్ష పడినంత మాత్రాన అత్యాచారానికి బలైన ఆ బాలికకుగాని, ఆమె కుటుంబానికిగాని న్యాయం జరిగిందని భావించకూడదని స్పష్టం చేశారు.
ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని పవన్ కోరారు. దోషుల కుటుంబాల నుంచి భారీగా నష్టపరిహారం రాబట్టి బాధితురాలికి అందజేయాలని సూచించారు. ఆమె నిలదొక్కుకుని సామాన్య జీవితం కొనసాగించడానికి తెలంగాణ మంత్రి, నవతరం నాయకులు కేటీ రామారావు (కేటీఆర్) చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.