ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యా విధానంను తిరోగమనంలో తీసుకు వెడుతూ ఉండడం తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాలు వెల్లడి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం స్పష్టం చేసింది. విద్యావిధానంలో మార్పులు శాస్త్రీయబద్దంగా కాకుండా ఆర్థిక అవసరాలకు లేదా ఆర్థిక ఇబ్బందుల వలన లేదా గత ప్రభుత్వాల విధానాలు నచ్చకనో మార్పులు చేయడంతో విద్యా వ్యవస్థ రోజు రోజుకి దిగ జారీ పోతుందని ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు, కార్యదర్శి బొప్పన రాజశేఖర్ రావు, సహాయ కార్యదర్శి పావులూరి ఖాజారావు ఆందోళన వ్యక్తం చేశారు.
పదో తరగతి ఫలితాలు తక్కువ రావడానికి కారణాలను ప్రస్తావిస్తూ, మొదటగా ఇంగ్లీష్ మీడియం తీసుకున్న పిల్లలు ఇబ్బంది పడినట్లు తెలిపారు. సోషల్ స్టడీస్ పేపర్ తెలుగులో రాయగలరు గాని ఇంగ్లీషులో రాయలేరని, అలాగే సైన్స్ కానీ, మాథ్స్ కానీ మాతృభాషలో చదివినంత ఇంగ్లీష్ మీడియంలో చదవలేరని చెప్పారు.
అలాగే, ఎయిడెడ్ స్కూల్స్ నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడంతో ఆయా సంస్థల నడపడంలో విఫలమవడం క్కూడా ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణమని పేర్కొన్నారు. మరో కారణం, కరోనా కాలంలో ప్రభుత్వానికి ఆన్ లైన్ లో తరగతులు నడిపే సామర్థ్యం లేకపోవడంతో పిల్లలను నేరుగా పదో తరగతికి ప్రమోట్ చేయడం, అటువంటి విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం తీసుకోవలసి రావడం అని స్పష్టం చేశారు.
ఎయిడెడ్ స్కూల్స్ కాలేజీలు నిర్వాహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడానికి ఆర్థికపరమైన ఇబ్బందులే ముఖ్య కారణం అని వారు స్పష్టం చేశారు. విద్యావ్యవస్థలో ఉన్నత వర్గాలు ప్రైవేట్ స్కూల్లో, కాలేజీలో చదువుతుంటే మధ్యతరగతి కుటుంబాలు ఎయిడెడ్ స్కూల్లో కళాశాలలో తక్కువ ఫీజులతో చదువుకుంటారని, అలాంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి అప్పగించమనటం అంటే దాతలిచిన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల మీద ప్రభుత్వ కన్ను పడటమే అని విమర్శించారు.
విదేశీ విద్యకు ప్రభుత్వ నిర్ణయం చాలా దారుణం అని మండిపడ్డారు. బలహీన వర్గాలు లేదా పేద వర్గాలు సాధికారత సాధించాలంటే వాళ్లు కూడా విదేశీ విద్య చదువుకునే అవకాశం కల్పించాలని, అలా అవకాశం కల్పించిన అవకాశాలను ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు.
కానీ ప్రభుత్వం ఆర్థిక పరమైన అంశాలు కోణం లో చూసి లేదా గత ప్రభుత్వ పథకాలలో విదేశీ విద్య లాంటి పథకాలను నిలిపి వేయడంతో అప్పటికే విదేశాలకు వెళ్లిన పిల్లల భవిష్యత్తు చాలా ఇబ్బందికర పరిస్థితులకు గురయినదని విచారం వ్యక్తం చేశారు. విదేశీ విద్య సంబంధించిన తల్లిదండ్రులు నెలల తరబడి దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు అంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని సందేహించాల్సి వస్తుందని విమర్శించారు.
ఇక, ఇంగ్లీష్ మీడియం చదివితేనే విద్యావ్యవస్థలో సమూల మార్పులు అన్న ప్రభుత్వపు అనాలోచిత చర్య లు విద్యార్థుల మీద తీవ్ర ప్రభావం చూపినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ వాతావరణంలో ఉన్న పిల్లవాళ్ళు నేర్చుకునే సామర్థ్యం మాతృభాషలోనే ఎక్కువ ఉంటుంది కానీ పరభాషలో కాదని స్పష్టం చేశారు. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం అనేది ఫలితం ఇస్తుంది కానీ స్కూల్ స్థాయి నుంచి ఫలితాలు ఇవ్వకపోగా చదువు లేని పరిస్థితుల్లో పరిక్షలు తప్పడం, ఆ విధంగా చదువు మానేయడం లాంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని హెచ్చరించారు.
విద్యా వ్యవస్థలో మార్పు అంటే పిల్లలకి చదువుతోపాటు ఆలోచనా జ్ఞానం అలాగే చేయగల సామర్థ్యం, అలాగే సామాజిక అంశాల మీద పట్టు ,ప్రపంచం పోకడలు మీద పట్టు వచ్చిన నాడే విద్యార్థుల్లో పోటీ తత్వం పెరుగుతుందని హితవు చెప్పారు. అప్పుడే మంచి మంచి ఉద్యోగాలు మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగాలు సంపాదించే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ఇంగ్లీషు వచ్చినంత మాత్రాన పోటీ తత్వం పెరుగుతుంది అనుకోవడం ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం అని స్పష్టం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్కూల్ స్థాయిలో పిల్లలకు మాతృభాషలోనే విద్యా విధానం నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుందని గుర్తించి, తెలుగు మాధ్యమంలోనే విద్యాప్రమాణాలు పెంచే విధంగా సమూల మార్పులు చేయడం ద్వారా సమాజానికి, ముఖ్యంగా బలహీన వర్గాల పిల్లలకి న్యాయం జరుగుతుందని హితవు చెప్పారు.
ఇక, మున్సిపల్ స్కూల్ నిర్వహణ లోపాలు ఉంటే ఆ మున్సిపల్ స్కూల్స్ అన్నిటిని కలిపి ఒక కమిషనరేట్ కిందకు తీసుకు వచ్చి ప్రభుత్వం ఆ మున్సిపల్ స్కూల్స్ పనితీరును పరిశీలించవచ్చని సూచించారు. కానీ, ఆ సాకుతో కోట్ల విలువ ఉన్న మున్సిపల్ స్కూల్ దాతల సహాయంతో సమకూర్చిన మున్సిపల్ స్కూల్స్ కు సంబంధించిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు కావని హెచ్చరించింది.
ఈ మున్సిపల్ స్కూల్స్ విలీనం ప్రక్రియ మున్సిపల్ స్కూల్స్ కు ఉన్న ఆస్తులను చూపించి మళ్లీ అప్పులు చేయడం కోసమే అని ఆరోపించారు. అమ్మబడి లాంటి ఓట్లు పథకాల ద్వారా రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది కానీ విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పు జరగదని స్పష్టం చేశారు. అమ్మ ఒడి పథకం పెట్టే బదులు ఆ పథకానికి నిధులు గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ ఆధునీకరించడంలో, అలాగే హాస్టల్ సదుపాయాలు పెంచటం, సౌకర్యాలు కల్పించటంలో అలాగే పెట్టాలని హితవు చెప్పారు.