ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ ) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. సోమవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రకటించారు.
రెపో రేటును గత నెలలోనే 40 బేసిస్ పాయింట్ల మేర పెంచగా, తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచారు. దీంతో రెపో రేటు 4.90 శాతానికి చేరింది. అధిక ద్రవ్యోల్బణం దృష్ట్యా సరళ విధాన వైఖరిని క్రమక్రమంగా సడలిస్తామంటూ ఆర్బీఐ గతంలోనే సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్బీఐ ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంది.
ఇలా క్రమంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్బీఐ రెపో రేటును 5.6 శాతానికి చేరుస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. పరపతి విధాన నిర్ణయాలకు ఆర్బీఐ పరిగణనలోకి తీసుకునే రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 7.79 శాతానికి చేరింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి. ఈ నేపథ్యంలో కీలక రేట్ల పెంపు ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయాన్ని మార్కెట్ నిపుణులు ముందే వ్యక్తం చేశారు.
అయితే ద్రవ్యోల్బణం పెరగడానికి కమొడిటీలు, ముడి చమురు ధరలే కారణం. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ఇందుకు అధిక కారణమన్నది గమనార్హం. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 13 నెలలుగా రెండంకెల స్థాయిల్లో నమోదవుతూ, ఏప్రిల్లో రికార్డు గరిష్ఠమైన 15.08 శాతాన్ని చేరింది. ఇవన్నీ రేట్ల పెంపునకు దారితీసిన అంశాలే.
2022లో ఇప్పటివరకు అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల్లో 45 దేశాల కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను పెంచాయి. తాజాగా ఆస్ట్రేలియా బ్యాంకు మంగళవారం వడ్డీరేట్లను 2 శాతం మేర పెంచింది. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించిన నేపథ్యంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి.
ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఆ లెక్కన సుదీర్ఘకాలం పాటు ఈఎంఐలు కట్టినప్పుడు ఆ విధంగా కట్టే వడ్డీ మొత్తం పెరుగుతుంది.