లద్దాఖ్ సమీపంలో చైనా( కదలికలు ఆందోళనకరమని అగ్రరాజ్యం అమెరికా భారత్ను అప్రమత్తం చేసింది. సరిహద్దు వెంబడి చైనా పలు మౌలిక సదుపాయాల ఏర్పాటును ఇందుకు కారణంగా పేర్కొంది.
హిమాలయ ప్రాంతంలో చైనా మౌలిక సౌకర్యాలు పెంచుతుండడంపై యూఎస్ ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ చార్లెస్ ఏ ఫ్లిన్ మీడియాతో మాట్లాడుతూ చైనా చర్యలు అస్థిరత, హానికరమైనవిగా స్పష్టం చేశారు.
‘‘చైనా కదలికల స్థాయి అప్రమత్తతను సూచిస్తోంది. పశ్చిమ ప్రాంత కమాండ్లో కొన్ని వసతులను పెంచుకోవడం కలవరపరుస్తోంది. చైనా తన మిలిటరీ వనరులు అన్నింటినీ పెంచుకుంటుంది. ఇవన్నీ ఎందుకని చైనాను ఎవరైనా ప్రశ్నించాలి ’’ అని ఆయన హెచ్చరించారు.
లద్దాఖ్ ప్రాంతంలో చైనా కదలికలు ఎక్కువవ్వడం, చాపకింద నీరులా రహస్య మార్గాల నిర్మాణం, అస్థితపరిచే చర్యలు, హానికరమైన ప్రవర్తన ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి ఏమాత్రం ప్రయోజకరం కాదని ఆయన స్పష్టం చేశారు. హానికరమైన శక్తులకు వ్యతిరేకంగా తామంతా ఉమ్మడిగా పనిచేయాల్సి ఉంటుందని భారత్కు సంకేతాలిచ్చారు.
భారత సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు తరచూ వెలుగులోకివస్తున్నాయి. హియాలయాల పొడవునా చైనా నిర్మాణాలు చేపడుతుండటం భారత్ కు ఆందోళనకు గురి చేస్తోంది. లడఖ్ సమీపంలో చైనా మరో వంతెన నిర్మిస్తున్న విషయం శాటిలైట్ ఫొటోల ద్వారా బహిర్గతమైందని ఛార్లెస్ ఏ ఫ్లిన్ గుర్తు చేశారు. లడఖ్లో జరుగుతున్న నిర్మాణాలు కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఉన్నట్లు ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో, చైనా చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫ్లిన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ అమెరికా సైనిక జనరల్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో సమావేశమయ్యారు.