అమరావతిలో రాజధానిగా ఆరు నెలల లోగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్లాట్ లను అందజేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన గడువు ముగిసినా ఆ దిశలో ఒక్కడుగు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వేయడం లేదు. పైగా, రాజధాని కోసం ఆ ప్రాంత రైతులు ఉచితంగా ఇచ్చిన భూములుఏళ్ళు గడచినా కొద్దీ తగ్గిపోతూ ఉండటం విస్మయం కలిగిస్తోంది.
సహజంగా ఎక్కడైనా కరువు పరిస్థితులో లేదా ప్రత్యేక పరిస్థితులో ఉంటే జనాభా తగ్గొచ్చు. కానీ, రాజధానిలో భూములు ఏ ఏడాదికాయేడాది తగ్గిపోతున్నాయి. సిఆర్డిఎలో భూపరిపాలన చూసే అధికారుల కనుసన్నల్లోనే ఈ భూములు మాయం అయ్యాయని, మరొకరికి అది సాధ్యం కాదని అధికారులూ స్పష్టం చేస్తున్నారు. ఈ తగ్గుదల వ్యవహారం సిఆర్డిఎలోనే చర్చనీయాంశం అవుతోంది. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
హైకోర్టు తీర్పు అనంతరం జరిగిన సమీక్షల్లోనూ, చర్చల్లోనూ దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓ ప్రత్యేకాధికారి తన పలుకుబడిని ఉపయోగించి మార్పులు చేశారని, దీని వెనుక వందల కోట్ల కుంభకోణం ఉందని చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపితే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.
రాజధాని పరిధిలో ల్యాండ్ పూలింగు జరిగిన సమయంలో తొలి సంవత్సరం 28,654 మంది రైతులు 34,398 ఎకరాలు పూలింగు రూపంలో ఇచ్చారు. ప్రభుత్వ, చెరువు, కాలువలు, కొండలు, వాగులు, ప్రభుత్వ ఆస్తులు, దేవాదాయ భూములన్నీ కలిపి సుమారుగా మరో 15 వేల ఎకరాల వరకూ తీసుకున్నారు. మొత్తం 53 వేల ఎకరాలు రాజధాని పరిధిలో సిఆర్డిఎ చేతుల్లోకి వెళ్లింది.
పట్టాదారులు ఇచ్చిన భూములకు రైతులకు ఏడాదికి వార్షిక కౌలు ఇస్తున్నారు. వాస్తవంగా 9.14 అగ్రిమెంటు ప్రకారం రైతులు ఇచ్చింది 34,398 ఎకరాలు. ఇది పూర్తిగా రైతుల వద్ద నుంచి సిఆర్డిఎ అధికారులు సర్వేచేసి దగ్గరుండి అగ్రిమెంటు చేయించుకున్న భూమి. ఇప్పుడు రికార్డుల్లో 32,059 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. సుమారు 2,339 ఎకరాలు రికార్డుల్లో నుండి తొలగిపోయింది.
ఇంత పెద్ద ఎత్తున భూములు ఎలా మాయం అయ్యాయనేది ప్రశ్నగా మారింది. సాధారణంగా ఒక ఎకరా లేదా నాలుగైదు ఎకరాలు తేడా రావొచ్చని, కానీ ఏకంగా 2,339 ఎకరాలు ఎలా మాయమయ్యాయని అధికారులు ప్రశ్నిస్తున్నారు. భూపరిపాలన చూసే ప్రత్యేకాధిరులే దీనికి సమాధానం చెప్పాల్సి ఉందని సొంత విభాగం అధికారులే డిమాండు చేస్తున్నారు.
ఒకవేళ భూమి స్థితిని యజమానులు మార్చుకున్నా, రికార్డుల్లో నుంచి తగ్గకూడదని, కానీ రికార్డుల్లో నుంచి మాయం అయిందని చెబుతున్నారు. సిఆర్డిఎకు అప్పగించిన తరువాత భూములు ఏమైనా చేసుకోవచ్చని, కానీ తాము ఇచ్చిన భూమే తగ్గిందని చూపించడం వెనుక ఏ ప్రత్యేకాధికారి భాగస్వామ్యం ఉందో తేల్చాలని రైతులు కోరుతున్నారు.
పూలింగులో తీసుకున్న భూముల స్థితి మారినా ఇంత పెద్దఎత్తున తేడా రాదని, దీనివెనుక భారీ కుంభకోణం ఉందని, విచారణ జరిపించాలనీ కోరుతున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ పరిపాలనా అధికారులను తీసుకొచ్చి సిఆర్డిఎలో నియమించారని, దీనివల్లే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.