తన మంత్రులకు, పార్టీ నేతలకు, ఉన్నతాధికారులకు సహితం ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉండరు. అయితే ఆయనతో రాజకీయంగా కొంతకాలంగా తలబడుతున్న గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ మాత్రం తాను `ప్రజల మనిషి’ని అని చెప్పుకొంటూ, ప్రజలకు రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని చెబుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంకు అయిష్టంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్న పంతం బట్టి `ప్రజా దర్భార్’లకు తెరదింపారు. శుక్రవారం మొదటిసారి `మహిళా దర్భార్’ జరపడం ద్వారా, తెలంగాణాలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాల గురించి వెలుగులోకి తెస్తూ, పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేపట్టిన్నట్లు సంకేతం ఇచ్చారు.
ఆమె వ్యవహారం చూస్తున్న వారందరికీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన కాంగ్రెస్ నేత కుముద్ బెన్ జోషి గుర్తుకు వస్తున్నది. ఆమె బాటలోనే డా. తమిళసై నడిచే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న కుముందు బెన్ జోషిని రాజీవ్ గాంధీ నవంబరు 1985 లో ఆంధ్ర ప్రదేశ్ కు గవర్నర్ గా పంపారు. అప్పుడు ఇక్కడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న టిడిపి అధినేత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిఖార్సయిన రాజకీయ నాయకురాలయిన ఆమెను కేవలం ఎన్టీఆర్ ను విసిగించేందుకే పంపారని ఆమె నడవడి స్పష్టం చేసింది.
అంతకు ముందుటి గవర్నర్ ల వలే ఆమె రాజ్ భవన్ కు పరిమితం కాలేదు. ఆమె 23 జిల్లాలను 108 సార్లు పర్యటించి గొప్ప రికార్డు సృష్టించారు. ఓ రాజకీయ నాయకురాలి వలే తిరిగారు. ప్రతిచోటా కాంగ్రెస్ నాయకులు ఆమెకు బ్రహ్మరధం పట్టేవారు.
ఆమెకు వ్యతిరేకంగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని చేసి రాష్ట్రపతికి పంపటం జరిగింది . కేంద్రం సహాయం లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి అభివృద్ధి సాధించలేదని వివాదాస్పదమైన ఉపన్యాసాన్ని రిపబ్లిక్ డే ఉపన్యాసంలో చెప్పి ఆమె పెను రాజకీయ వివాదం సృష్టించారు.
గవర్నర్ బంగళా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు చేసిందని తెలుగు దేశం వారు గగ్గోలు పెట్టారు . ఇప్పుడు తమిళ సై కేవలం మహిళా దర్బారుకు శ్రీకారం చుట్టారు . కుముద్ బెన్ జోషి జోగినిలకు వివాహాలు కూడా చేసారు. గవర్నర్ బంగళాలో తరచూ మీడియా సమావేశాలు పెట్టి హడావుడి చేసేవారు.
అయిదేళ్ళ పాటు అంటే 1990 ఫిబ్రవరి దాకా గవర్నర్ గా ఉన్నారు . 1989 నవంబరులో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు డా. తమిళిసై సహితం తరచూ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆయన ఆశీస్సులతోనే పనిచేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతున్న కొద్దీ ఆమె క్రియాశీలత కూడా పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తనను తరచూ అవమానాలకు గురి చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేస్తున్నారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు, ఉన్నతాధికారులు ఎవ్వరు రాజ్ భవన్ వైపు చూడటం లేదంటూ వాపోతున్నారు.
అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం కేసీఆర్- మోదీ విరోధం అంతా ఓ డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. ఉమ్మడిగా కాంగ్రెస్ ను బలహీనం చేయడం కోసం ఎత్తుగడలు వేస్తున్నట్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ కేవలం ముఖ్యమంత్రి, మంత్రి మండలికి సలహా, సహాయ సహకారాలు మాత్రమే అందించాల్సి ఉందని రాజ్యాంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా దర్భార్ నిర్వహించడం రాజకీయ కార్యక్రమమే కాగలదని పలు విమర్శలు చెలరేగుతున్నాయి.
ఏదైమైనా, ఇప్పుడు కుముద్ బెన్ జోషి మాదిరిగా ఆమె సహితం వచ్చే ఏడాది ఎవ్వరిని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలి అనుకొంటున్నారా చూడవలసి ఉంది. కేటీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి/బండి సంజయ్ ల పేర్లు ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి.