జివికె గ్రూపులో భాగమైన జివికె కోల్ డెవలపర్స్ సంస్థ పలు బ్యాంక్లకు రూ.12,114 కోట్లు (1.5 బిలియన్ డాలర్లు) ఎగనామం పెట్టింది. ఆయా బ్యాంక్ల నుంచి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేదు. దాదాపు 11 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పులను రాబట్టుకోలేక ఆయా బ్యాంక్లు ఇప్పుడు లబోదిబో మంటున్నాయి.
అసలుతో పాటు వడ్డీ చెల్లించాలని ఆరు బ్యాంక్లు తాజాగా లండన్ హైకోర్టును ఆశ్రయించాయి. అప్పులిచ్చిన భారత బ్యాంక్ల్లో కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం వెలువరించింది.
ఈ విత్త సంస్థలు 2011లో ఒక్క బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7600 కోట్లు) రుణం, రూ.273 కోట్లు లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో అందించాయి. ఐదు బ్యాంక్లు 2014లో మరోసారి రూ.1,250 కోట్లు అప్పుగా ఇచ్చాయి. ఈ అప్పులన్నిటీని చెల్లించడంలో సింగపూర్ కేంద్రంగా ఏర్పాటు చేసిన జివికె కోల్ డెవలపర్స్ సంస్థ విఫలమయ్యింది.
రుణాలు పొందే సమయంలో జివికె గ్రూపులోని ఇతర తొమ్మిది సంస్థలు గ్యారంటీగా ఉన్నాయి. ఇందులోనూ ఏడు సంస్థలు సింగపూర్ కేంద్రంగా పని చేస్తుండగా.. మరో రెండు సంస్థలు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్నాయి. ఈ కేసు సోమవారం విచారణకు రానుందని సమాచారం. ఈ అప్పులపై ఆ కంపెనీ స్పందించడానికి నిరాకరించింది.
ఈ రుణాలతో జివికె గ్రూపు ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్లో అల్పా ప్రాజెక్టు గనులను లీజుకు తీసుకుంది. బగ్గు రంగం మార్కెట్లో ఒడిదుడుకులు, థర్డ్ పార్టీ పెట్టుబడుల్లో సమస్యలు, ఈ ప్రాజెక్టుపై క్వీన్స్లాండ్ కోర్టులో న్యాయ సమస్యల కేసులు తదితర అంశాలతో ఈ ప్రాజెక్టులో స్వల్ప పురోగతి మాత్రమే చోటు చేసుకుందని సమాచారం.
గనుల లీజు సమయంలో పర్యావరణ సంస్థల నుంచి సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తిరిగి అప్పులు చెల్లించలేదు. ఇచ్చిన రుణాలు తిరిగి చెల్లించాలని 2020 నవంబర్లో బ్యాంక్లకు జివికెను ఆదేశించాయి. జివికె లేదా గ్యారెంటీ ఇచ్చిన సంస్థలు రుణాలు చెల్లించకపోతే చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నాయి.