ఎటువంటి డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడకపోయినా, తనపై అంతర్జాతీయ మాదక ద్రవ్యాల సరఫరాదారుడిగా ముద్ర వేయడం సరైనదా? అంటూ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ వేస్తున్న ప్రశ్నలకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సమాధానం చెప్పలేక తలవంచుకొంటున్నారు.
గత ఏడాది అక్టోబర్లో ముంబయి తీరంలో క్రూజ్ నౌకలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న ఎన్సిబి అధికారులు దీనికి ఆర్యన్ ఖాన్కు సంబంధముందంటూ ఆయన్ను అరెస్టు చేశారు. అనేక వారాలు జైలులో ఉంచారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఈ విషయమై మీడియా విస్తృతంగా ప్రచారం కలిగించింది.
ఆ సమయంలో ఆర్యన్ అక్రమ డ్రగ్స్ కలిగి ఉండటం నుండి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ గత నెలలో తగిన సాక్షాలు లేవని పేర్కొంటూ ఎన్సిబి క్లీన్చిట్ ఇచ్చింది. అయితే ఇన్ని రోజులు ఆర్యన్, షారూఖ్ ఎదుర్కొన్న అవమానాలపై ఎంతో ఆవేదన వ్యక్తం చేశారని సీనియర్ ఎన్సిబి అధికారి ఒకరు తెలిపారు.
ఈ కేసు విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన ఎన్సిబి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజరు సింగ్ ఆర్యన్తో ఇటీవల జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు. ఈ కేసులో తనను పట్టుకున్నప్పుడు అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారుడిగా తనపై ముద్రవేశారని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ఆర్ధిక సాయం చేస్తున్నానని తనపై అపనిందలు వేశారని గుర్తు చేశారు.
మరి ఇప్పుడు ఈ ఆరోపణలు అసంబంద్ధమైనవి కావా? తన ప్రతిష్టను నాశనం చేశారంటూ, అన్ని వారాలు తాను జైలులో ఉండాల్సిన వ్యక్తినా అంటూ తన ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. తమను సమాజం నాశనం చేసే నేరస్తులు, రాక్షసులుగా చిత్రించారని షారూఖ్ అన్నట్లు తెలిపారు. ఈ కేసులో కుమారుడికి క్లీన్చిట్ రావడంతో షారూఖ్ సినిమాలపై ఫోకస్ పెంచారు. పఠాన్, జవాన్, డుంకీ వంటి చిత్రాలు త్వరలో రాబోతున్నట్లు ప్రకటించారు.